జిల్లా కు కేటాయించిన యూరియాను వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా
అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఒంగోలులోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యూరియా వినియోగం పై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధ్యక్షతన జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో యూరియా వినియోగంపై డిఎస్ఓ, ఇండస్ట్రీస్, లేబర్, ఎక్సైజ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, డిటిసి, విజిలెన్స్ అండ్ ఫోర్స్మెంట్, పోలీస్, అగ్రికల్చర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. యూరియా వ్యవసాయానికి కాకుండా వేరేదానికి ఉపయోగించారా అనేది కనిపెట్టాలని, ఇందుకు సంబంధించి ఆయా శాఖల అధికారులు కలిసికట్టుగా తనిఖీలు నిర్వహించి సమగ్ర నివేదిక అందించాలన్నారు. పౌర సరఫరాల శాఖతో సమన్వయం చేసుకుని ఎడి.బి.ఎల్.యు యూనిట్లను తనిఖీలు చేయాలన్నారు. పరిశ్రమ, కార్మిక విభాగాలు మరియు కాలుష్య బోర్డుతో సమన్వయం చేసుకుని ప్లైవుడ్/రెసిన్ యూనిట్ల తనిఖీలు చేయాలని, పరిశ్రమ, కార్మిక విభాగాలు మరియు కాలుష్య బోర్డుతో సమన్వయం చేసుకుని పెయింట్స్/వార్నిష్ యూనిట్ల తనిఖీలు చేయాలని ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాలకు సబ్సిడీ యూరియాను, ఎరువులను అనధికారికంగా తరలింపును నిరోధించడానికి విజిలెన్స్, రవాణా మరియు పోలీసు శాఖల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంత యూరియా కేటాయించారు, ఎంత పంపిణీ చేశారు, తదితర వివరాలకు సంబంధించిన నివేదిక అందించాలన్నారు. జిల్లాకు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో ఏప్రిల్ నుంచి ఆగష్టు నెల వరకు 54,468 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఈ ఏడాది ఏప్రిల్ కు జిల్లా లో 27,111 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో వుండగా, ఇప్పటి వరకు జిల్లా కు 34,051 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కాగా, ఇప్పటి వరకు 30,565 మెట్రిక్ టన్నుల యూరియా విక్రయించగా, ఇంకా జిల్లా లో 30,597 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస రావు, డిటిసి సుశీల, జిల్లా పరిశ్రమల శాఖ జిఎం శ్రీనివాసరావు, మార్క్ ఫెడ్ డిఎం హరికృష్ణ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, లేబర్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

