” డిపార్ట్మెంట్ తరఫున చేయవలసిన
కనీస విధుల నిర్వహణలోనూ నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యోగం ఎందుకు?… పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేస్తాను “… అని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
హెచ్చరించారు. ఐ.సి.డి.ఎస్. అధికారులతో గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డిపార్ట్మెంట్ తరఫున అందిస్తున్న సేవలు, సిబ్బంది – ఖాళీలు, ఎంతమంది చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకున్నారు, వాటిని నిర్వహిస్తున్న భవనాలు ( సొంత – అద్దె ), తదితర వివరాలపై కలెక్టర్ చర్చించారు. ఐసిడిఎస్ పిడి సువర్ణ ఆయా వివరాలను కలెక్టరుకు వివరించారు. ప్రతి అంగన్వాడి కేంద్రంలో 12 రకాల రిజిస్టర్లు ఉంటాయని, పిల్లల హాజరు, ఎత్తు, బరువు, గర్భిణులకు, బాలింతలకు పోషకాహారం పంపిణీ, వాక్సినేషన్, సెక్టార్ మీటింగ్స్ నిర్వహణ తదితర వివరాలను ఆ రికార్డులలో నమోదు చేస్తారని చెప్పారు. ప్రత్యేకంగా ప్రభుత్వం రూపొందించిన మొబైల్ యాప్ లలోనూ వీటిని పొందుపరచాల్సి ఉంటుందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ పిల్లల ఎత్తు, బరువుకు సంబంధించిన వాస్తవ వివరాలను కాకుండా, ఊహాజనిత వివరాలను కొందరు నమోదు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. డిపార్ట్మెంట్ తరఫున చేయాల్సిన కనీస విధుల్లోనూ నిర్లక్ష్యం వహిస్తే సహించబోనని హెచ్చరించారు. సూపర్వైజర్లు, సిడిపివోలు ఈ విషయాలను సమగ్రంగా పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని పి.డి.ని కలెక్టర్ ఆదేశించారు. అప్పటికీ అంగన్వాడి కేంద్రాల్లోని సిబ్బంది పనితీరులో మార్పు రాకపోతే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి విధుల్లో నుంచి తొలగిస్తానని చెప్పారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పనిచేసే వివిధ విభాగాలను సమన్వయపరుస్తూ
పరిస్థితిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని పి.డి.ని ఆమె ఆదేశించారు.
ఈ సమావేశంలో డిసిపిఓ దినేష్ కుమార్, సిడిపివోలు పాల్గొన్నారు.
