అన్నీ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ, ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు.
గురువారం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 101 మంది లబ్ధిదారులకు రూ.57.70 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. బిల్ క్రింటన్ పౌండేషన్, టాటా పౌండేషన్ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ ఆరోగ్యం చేసి ప్రతి పౌరునికి అవసరమైన వైద్య సేవలను అందించి వైద్య ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. గడచిన ఏడాది కాలంలో కొండపి నియోజకవర్గంలో 732మంది లబ్దిదారులకు రూ.6కోట్ల 31 లక్షల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. అనర్హుల పించన్లు తొలగించమని అన్నీ వర్గాల ప్రజల నుండి విజ్ఞప్తులు అందడంతో పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగిందని, అర్హులైన ఏ ఒక్కరి పింఛన్ తొలగించడం జరగదని మంత్రి స్పష్టం చేసారు. రైతులకు సకాలంలో సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామని అలాగే, బర్లీ పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉందన్నారు. పొగాకు రైతులకు అదనపు రుసుం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉందని మంత్రి తెలిపారు.
