ప్రభుత్వ పథకాలకు అవసరమైన భూములను త్వరగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశము భవనం నుంచి జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణ ఇందులో పాల్గొన్నారు. పీ. ఎం. కుసుమ్ సోలార్ విద్యుత్ ప్లాంట్స్, ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు భూముల గుర్తింపు, యూరియా లభ్యత – అపోహల తొలగింపు, పెన్షన్ల వెరిఫికేషన్ – అర్హులకు కొనసాగింపు, భూగర్భ నీటి మట్టం పెంపు, జిల్లా జువైనల్ జస్టిస్ కమిటీల ఏర్పాటు, తదితర అంశాలపై సంబంధిత జిల్లాల వారీగా సీ.ఎస్. సమీక్ష నిర్వహించారు. అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానమని ఆయన స్పష్టం చేశారు. పెన్షన్ల వెరిఫికేషన్ పై అప్పీల్ చేస్తే, విచారణ పెండింగ్లో ఉన్న వారికి కూడా సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
కాగా, పీ.ఎం.కుసుమ్ సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి భూముల గుర్తింపును వేగవంతం చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. దొనకొండ మండలం బాధాపురం గ్రామంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి 2149 ఎకరాల భూములను ఇప్పటికే గుర్తించామన్నారు. జిల్లాలో సాగుకు అవసరమైన స్థాయిలో యూరియా అందుబాటులో ఉన్న విషయాన్ని రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. అక్రమంగా నిలువ ఉంచినా,
అధిక ధరలకు విక్రయించినా బాధ్యులపై కఠిన
చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూగర్భ నీటిమట్టం పెంచేలా డ్వామా, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో నీటి సంరక్షణ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి, డి.ఆర్.డి.ఏ. పి.డి. నారాయణ, ఐ.సీ.డీ.ఎస్. పీ.డీ. సువర్ణ, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస రావు, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.


