వస్తు సేవా పన్నులను ప్రభుత్వం తగ్గించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు
తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరం నుండి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలతో శుక్రవారం ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు.
వస్తు సేవల పన్ను తగ్గింపుపై విస్తృతమైన ప్రచారం చేయాలని, పండుగ వాతావరణంలో ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ చెప్పారు. సాధారణ కుటుంబంలో నిత్యవసర వస్తువులకు ప్రతి నెల రూ.15వేలు ఖర్చు అవుతుండగా, జిఎస్టి తగ్గింపు ద్వారా ప్రస్తుతం రూ.మూడు నుంచి రూ.నాలుగు వేలు తగ్గుతాయన్నారు. తద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. కేవలం రెండు పన్నుల విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ విషయాలను స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. శనివారం నుండి అక్టోబర్ 19వ తేదీ వరకు వినూత్నంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను జయప్రదంగా నిర్వహించాలన్నారు. వివిధ రకాలుగా షాపింగ్ మేళాలలు నిర్వహిస్తూ... తగ్గిన ధరలు అందుబాటులోకి వచ్చిన విషయాలను ప్రజలకు వివరించాలన్నారు.
ప్రజలకు ప్రభుత్వం కల్పించిన లబ్ధిని సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికీ చేరవేయాలని కలెక్టర్ అన్నారు. అధికారులు యాప్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని, తద్వారా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నిక్షిప్తం చేయాలన్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని, వాణిజ్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. అన్ని వర్గాల ప్రజలపై పన్నుల భారం తగ్గిపోయిన విషయాన్ని వివరించాలన్నారు.
వస్తు సేవ పన్ను తగ్గింపుపై ర్యాలీలు నిర్వహించాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ తెలిపారు. రానున్న నాలుగు వారాలలో ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రచారాలు నిర్వహించాలన్నారు. జిఎస్టి ఫలాలు పేరిట ఈనెల 26 నుంచి 29 తేదీ వరకూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గృహ నిత్యావసర వస్తువులు, ఆహారం, మందులు, విద్యా, దుస్తులు, క్రీడా వస్తువులపై తగ్గిన పన్నులను వివరించాలన్నారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు ఆరో తేదీ వరకూ వ్యవసాయం, వ్యవసాయ, ఉద్యాన వన, ఉపాధిహామీ కూలీలు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, ట్రేడింగ్ ఎంస్ఎంఇలు, నేత, హస్త కళాకారులు, పేపరు, ఫ్యాకేజింగ్, జిమ్ తదితర రంగాల్లో పనిచేసే వారికి అవగాహన కల్పించాలన్నారు. ట్రాక్టర్ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. అక్టోబరు ఏడు నుంచి 13 తేదీ వరకు మానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ సాంకేతికతకు సంబంధించి విద్య, జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్పు, ఇ-కామార్స్ అండ్ గిగ్ ఎకానమీకి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విద్యార్ధులకు వ్యాసరచన, పెయింటింగ్ పోటీలు, జిల్లా స్థాయిలో మాన్యుఫ్యాక్చర్లు, డీలర్లచే ఎగ్జిబిషన్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలన్నారు. అక్టోబరు 14న జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో వికాస్ విస్వాస్ -నమ్మకమైన అభివృద్ధికి సంబంధించి భవన నిర్మాణ రంగాలపై అవగాహన, ప్రదర్శనలు నిర్వహించాలన్నారు. 15న చిన్న వాహనాల ర్యాలీ, 16న బైక్ ర్యాలీలు, దీపావళి పర్వదినానికి ముందు రోజైన అక్టోబరు 19వ తేదీన ముగింపు కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలన్నారు.
ఈ సమావేశంలో వాణిజ్య శాఖ డిడి సత్యప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

