ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి మరియు నేరాలను సమర్థవంతంగా నివారించడానికి జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు.
ఇందులో భాగంగా, రాత్రి గస్తీ సమయంలో మొబైల్ సెక్యూరిటీ చెక్డ్ డివైజ్ ను ఉపయోగిస్తున్నారు. ఈ ఎం.ఎస్.సి.డి పరికరం ద్వారా పోలీసులు ఒక వ్యక్తి వేలిముద్రను అప్పటికప్పుడే తీసుకొని, అది నేర చరిత్ర ఉన్న వ్యక్తిదా..? కాదా..? అనే విషయాన్ని అక్కడికక్కడే తెలుసుకొని పలు చర్యలు తీసుకుంటున్నారు.
సెప్టెంబర్ నెలలో పోలీసులు మొత్తం 4494 మంది అనుమానిత వ్యక్తులను తనిఖీ చేశారు.ఈ తనిఖీలలో 15 మంది ముద్దాయిలను గుర్తించడం జరిగింది.
గతంలో ఒంగోలుకు చెందిన షేక్ రఫీ అనే వ్యక్తి సుమారు 12 కేసులలో ముద్దాయిగా ఉన్నట్లు తేలింది.వెంటనే గుర్తించిన పోలీస్ సిబ్బంది ముద్దాయిలందరినీ సంబంధిత పోలీస్ స్టేషన్లలో బైండ్ ఓవర్ చేయడం జరిగింది.
జిల్లాలో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు, కొత్తగా వచ్చిన వారి పర్యవేక్షణను పోలీసులు నిరంతరం కొనసాగిస్తున్నారు.
రాత్రి వేళల్లో జిల్లా పోలీసులు గస్తీ మరియు తనిఖీలను మరింత ముమ్మరం చేస్తున్నందున, ప్రజలు రాత్రి వేళల్లో ప్రయాణించేటప్పుడు గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని పోలీసువారు విజ్ఞప్తి చేస్తున్నారు.
సరైన గుర్తింపు కార్డు లేని వారిని ప్రశ్నించడం జరుగుతుంది.
జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి, అక్కడ ఎటువంటి నేరాలు జరుగకుండా తనిఖీలు, అనుమానితులను విచారించడం మరియు గస్తీ ముమ్మరం చేయటం జరుగుతుంది.
ప్రజలు పోలీసులకు సహకరించి, సురక్షితమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు కోరారు.


