రెవెన్యూ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండటంతో పాటు రెవెన్యూ సమస్యలపై వచ్చే ఆర్జీలపై క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపేలా రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
పేర్కొన్నారు.
శుక్రవారం ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హల్లో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసులతో కలసి రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్దార్లు, సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారులతో సమావేశమై పిజిఆర్ఎస్, రెవెన్యూ సమస్యలు, మ్యుటేషన్లు, జిల్లాకు సంబంధించిన ఐవిఆర్ఎస్ కాల్స్ తదితర అంశాలపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. క్షేత్ర స్థాయిలో వచ్చిన వివిధ రెవెన్యూ సమస్యలను ఏ విధంగా పరిష్కారం చూపబడిందన్న విషయాలపై సమగ్రంగా డాక్యుమెంటేషన్ చేసి సంబంధిత మండల తహసిల్దార్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించగా, వీటి పై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమగ్రంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. జిల్లాలో వివిధ సమస్యలపై వచ్చే అర్జీల్లో సుమారు 70 నుండి 80 శాతం అర్జీలు రెవెన్యూ సంబంధిత అంశాలపై రావడం జరుగుచున్నదన్నారు. ఈ నేపధ్యంలో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారులు రెవెన్యూ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ సమస్యలపై వచ్చిన ఆర్జీల పరిష్కారం పై లేదా తిరస్కరించడంపై ప్రధానంగా ఐవిఆర్ఎస్ ద్వారా అభిప్రాయ సేకరణ జరుగుతోందని చెప్పారు. పరిష్కారం అయ్యే సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. పరిష్కారం చేయలేనివాటికి సంబంధించి, అర్జీదారులకు ప్రభుత్వ నిబంధనలను వివరిస్తూ ఏ కారణాలవల్ల వారి సమస్య పరిష్కారం కావడంలేదో సమగ్రంగా తెలియజేయాలని చెప్పారు. అర్జీదారులకు సమగ్ర వివరాలతో నోటీసు అందించి, వారి సంతకం తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా మాట్లాడాలని సూచించారు. దీనికోసం రెవెన్యూ అధికారులు తమ దృక్ఫథాన్ని మార్చుకొని, సానుకూల దృష్టిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. వచ్చిన రెవెన్యూ సమస్యపై విఆర్ఓ క్షేత్ర స్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వడం, అలాగే తహసిల్దార్ నోటీసు మరియు స్పీకింగ్ ఆర్డర్స్ జారీ పారదర్సకంగా కచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా ఉన్నప్పుడే అర్జీదారులు తన సమస్య పరిష్కారం పై సంతృప్తి చెందే అవకాశం ఉందన్నారు. మనం చేసే పని ప్రజలకు సంతృప్తికరంగా ఉండాలన్నారు. ఆర్డీవోలు వారి పరిధిలో గల తాసిల్దార్లతో సమన్వయం చేసుకొని నిర్దేశిత గడువు లోపల అర్జీలను పరిష్కరించాలన్నారు.
జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ మాట్లాడుతూ….ఇటీవల కనిగిరిలో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో 814 దరఖాస్తులు రాగా, అందులో 587 ధరఖాస్తులు రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు రావడం జరిగిందని, సమస్యల వారీగా బ్రేక్ ఆప్ చేసి వీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు.
ఈ సమావేశంలో ఒంగోలు రెవిన్యూ డివిజనల్ అధికారి కళావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్సన్, సత్యనారాయణ, శివరామిరెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డిడి గౌస్ బాషా, జిల్లాలోని అన్నీ మండల తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


