కుత్బుల్లాపూర్ నవంబర్ 2(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రభుత్వ భూములను ఖబ్జా చేసిన బడా బాబులను రక్షిస్తున్న హైడ్రా పేదల ఇళ్లపై మాత్రం ప్రతాపం చూపడం సిగ్గు చేటని తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదన చారి అన్నారు. ఆదివారం బిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశాల మేరకు కుతుబుల్లాపూర్ మండలం గాజులరామారం గ్రామం సర్వే నంబర్ 307 లో ఏమ్మెల్యే అరికెపూడి గాంధీ కుటుంబసభ్యుల పేరుతో బారికేడ్లను ఏర్పాటు చేసుకున్న 11 ఎకరాల భూమిని సందర్శించి ప్రభుత్వ ద్వంద ప్రమాణాలను ఎండగట్టారు. 307 సర్వే నంబర్ లో పేదలకు చెందిన 270 ఇళ్లను కూల్చిన హైడ్రా అధికారులు 11 ఎకరాల స్థలానికి వేసిన బారికేడ్లను కూల్చి మళ్లీ నిర్మిస్తే మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఒకనీతి పెద్దలకు ఒక నీతి అన్నట్లుగా ఉందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వ భూముల్లోని పేదలను బయటకు వెళ్లగొట్టి పెద్దలకు కట్టబెడుతున్నారు. బి ఆర్ ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీ కుటుంబానికి 1100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను పార్టీ మారినందుకు నజరానాగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే గాంధీ కుటుంబానికి చెందిన 11 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ పేదల వ్యతిరేక నిర్ణయాలను గమనించాలని, ప్రభుత్వ భూములను పెద్దలకు దోచి పెడుతున్న విధానాలను ఎండగట్టి ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమలో పార్టీ రాష్ట్ర నాయకులు మాజీమంత్రులు, శాసన సభ్యులు జగదీశ్రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, సునీత లక్ష్మారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, ఎంఎల్సీలు శంభీపూర్ రాజు, సీనియర్ నాయకులు పార్లమెంట్ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తో పాటు కూకట్పల్లి నియోజకవర్గం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కుతుబుల్లాపూర్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


