భారత్ సమగ్రాభివృద్ధికి పునాదులు వేసిన నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పై విమర్శలు చేయడం తగదని భారత సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తామని చెప్పుకొని ఆర్.ఎస్.ఎస్ బిజెపి లాంటి సంస్థలు సోషల్ మీడియాలో నెహ్రూ వ్యక్తిగత హననానికి పాల్పడటం హేయమైన చర్యని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా అన్నారు.
ఒంగోలు లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన 136 జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పుష్పాంజలి ఘటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ …నెహ్రూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేసి, పంచవర్ష ప్రణాళికలను అమలు చేసి, అతి పేదరికంలో ఉన్న భారత్ ను ముందుకు నడిపిన మహనీయుడని కొనియాడారు. అమెరికా, రష్యా కూటముల వైపు మొగ్గకుండా అలీన ఉద్యమానికి నాయకత్వం వహించి ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొదారన్నారు. దేశ విభజన అనంతరం 565 సంస్థానాలను విలీనం చేసి ఫ్రెంచ్ నుండి పుదుచ్చేరిని, పోర్చుగీసు నుండి గోవాను విముక్తి చేసి భారత దేశ సమగ్రతను కాపాడినారని తెలిపారు. సామాజిక మధ్యమాలలో నెహ్రూ గురించి 79 తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని, మహా పురుషులను గౌరవించే సాంప్రదాయమున్న మనదేశంలో తల్లిదండ్రులను, మహిళలను అగౌరవ పరచడం అమానవీయమన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కు షేక్ అబ్దుల్లా, మహారాజ హరిసింగ్ లతో గల సత్సంబంధాలతో నేడున్న జమ్మూ కాశ్మీర్ ను కాపాడుకోగలిగామన్నా ఐఐటి, ఐఐఎం, ఇస్రో, ఎయిమ్స్ , సిఎస్ఐఆర్, డిఆర్డిఓ, ఆర్ ఈ సి లాంటి విద్య పరిశోధనా సంస్థలను, నాగార్జున సాగర్, హీరాకుడ్, భాక్రానంగల్ లాంటి బహులార్ధ సాధక నీటి ప్రాజెక్టులను, బిహెచ్ఈఎల్, ఐడిపిఎల్ , సెయిల్, కోల్ ఇండియా లాంటి పారిశ్రామిక సంస్థలను ప్రారంభించి అభివృద్ధి చేసి దేశం వేగంగా పయనించడానికి కారణ భూతుడైనాడని తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై 1929లో సంపూర్ణ స్వాతంత్య్రన్ని సాధించాలనే తీర్మానాన్ని ఆమోదింప చేశారన్నారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1930లో ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, 9 సంవత్సరాల జైలు జీవితం అనుభవించినారన్నారు. ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్సస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, లెటర్స్ టు ద డాటర్ లాంటి గ్రంథాలను రచించి సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలను అవగాహన చేసుకున్న ప్రపంచ మేధావి నెహ్రూ అని అభివర్ణించారు . యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ నిర్మాణంలోనూ, రాజ్యాంగ రూపకల్పన లోను నెహ్రూ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. రాజ్యాంగ పీఠికను రూపొందించడంలో, ఆదేశిక సూత్రాల రచనలో నెహ్రూది ముఖ్య భూమిక అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం సాంస్కృతిక జాతీయవాదం, ఉదార జాతీయవాదం, సోషలిస్ట్ జాతీయ వాదాలుగా కొనసాగిందని, నేడు సాంస్కృతిక జాతీయవాదమే అగ్ర భాగాన చేరి నెహ్రూపై నిందలు వేసిందన్నారు. నెహ్రూ 1956లో ప్రారంభించిన నాగార్జున సాగర్ ఫలితంగా పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులకు కారణ భూతమయ్యిందన్నారు. నెహ్రూ నాడు చాటి చెప్పిన సోషలిజం, సమ్మిళత వృద్ధి, లౌకిక వాదాల పట్ల వ్యతిరేక భావాలు ఉన్న ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి సంస్థలు నెహ్రూపై నిందలు వేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ రసూల్, గోరంట్ల కోటేశ్వరరావు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు తిరిగినేని వెంకట నరసయ్య షేక్ రవూఫ్, పైన మధు, ఎం. జాకబ్, జిల్లా బీసీలు ఉపాధ్యక్షులు ఏమని కోటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ కంట్రోల్ బోర్డు సభ్యులు కందుల కృష్ణ బాబు, జిల్లా మైనార్టీ నాయకులు సయ్యద్ కరీం బేగ్, సామాజికవేత్తలు షేక్ కాలేశా, ఆటో యూనియన్ నాయకులు పవన్, రామకృష్ణ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.
