హైదరాబాద్ డిసెంబర్ 22 , ( జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆరోగ్యం, విద్య, ఉపాధి వంటి సామాన్యల సమస్యల పరిష్కారం లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందనీ, అదే మా ఎజెండా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు.సోమవారం బేగంపేటలోని హోటల్లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.రెండవ శ్రేణి నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్స్ ప్రారంభించాలని విజయ మెడికల్ సెంటర్ నిర్ణయించడం అభినందనీయం వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, అన్ని రకాల పరీక్షలను చేయాలని అందుకు ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. కొన్ని దశాబ్దాల క్రితమే లేజర్ వైద్యం ద్వారా మ్యాక్సీవిజన్ కాసు ప్రసాద్ రెడ్డి తన జ్ఞానాన్ని సమాజానికి ఇచ్చారు అని వివరించారు. సూర్యనారాయణ, ప్రసాద్ రెడ్డి, వేలు ముగ్గురు బాల్య స్నేహితులు కొన్ని దశాబ్దాల పాటు కలిసి ఉండటమే కాదు విజయవంతంగా వ్యాపారం నిర్వహిస్తుండడం అభినందనీయం అన్నారు.
ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కీలకమైన తొలి రక్షణ అడుగును బలోపేతం చేసే ప్రయత్నమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. డయాగ్నోస్టిక్స్ సక్రమంగా పనిచేస్తే ఎలాంటి హడావిడి ఉండదని, కానీ అవి విఫలమైతే మొత్తం వ్యవస్థే కూలిపోతుందని అన్నారు.
2023 డిసెంబర్లో తమ ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రజలు ఆర్భాటం కోరలేదని, భరోసానే కోరారని తెలిపారు.ఆరోగ్యం లేకుండా గౌరవం ఉండదని, గౌరవం లేకుండా నిజమైన అభివృద్ధి సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రజా ఆరోగ్యాన్ని మౌలిక అంశంగా తీసుకుని ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.ముఖ్యంగా హైదరాబాద్ వెలుపల ప్రాంతాల్లో నాణ్యమైన డయాగ్నోస్టిక్ సదుపాయాల విస్తరణకీలకమన్నారు.డయాగ్నోస్టిక్స్ ఆరోగ్యం-వ్యాధి మధ్య, నివారణ–చికిత్స మధ్య కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి జిల్లాలకు అధునాతన డయాగ్నోస్టిక్ సదుపాయాలు చేరితే ప్రజలపై పడే ఆర్థిక, మానసిక భారం తగ్గుతుందని అన్నారు. ఆరోగ్య రంగంలో దూరం అనేది కేవలం కిలోమీటర్లలో కాదు, ఆందోళన, ఆలస్యం, ఖర్చుల రూపంలో ఉంటుందన్నారు.ఆధునిక వైద్యం ప్రారంభ దశలో వ్యాధి గుర్తింపుపై ఆధారపడి ఉంటుందని, విశ్వసనీయమైన డేటా లేకుండా ప్రజా ఆరోగ్య ప్రణాళికలు సాధ్యం కాదన్నారు.రాష్ట్రంలో ఆరోగ్యం కొందరికే పరిమితమైన హక్కు కాదని, ప్రజా సంపదగా ప్రభుత్వం భావిస్తోందన్నారు. వ్యాధిని చికిత్స చేయడమే కాదు, ముందే అంచనా వేసే దిశగా ప్రభుత్వ విధానం ఉందన్నారు.న్యూబర్గ్ డయాగ్నోస్టిక్స్, విజయా మెడికల్ సెంటర్ల విస్తరణకు డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు. ఖచ్చితత్వం, నైతికత, సానుభూతితో తెలంగాణ ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసే ప్రతి ప్రయత్నానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.



