ప్రకాశం జిల్లాకు తలమానికంగా మారనున్న రామాయపట్నం పోర్ట్ మొదటి విడత నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తి -జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు

      ప్రకాశం జిల్లాకు తలమానికంగా మారనున్న రామాయపట్నం పోర్ట్ మొదటి విడత నిర్మాణ పనులు దాదాపు 80 శాతం పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపారు. బుధవారం ఆయన రామాయపట్నం పోర్టును సందర్శించారు. పోర్టు నిర్మాణ పనులు, భూ సేకరణపై సంబంధిత అధికారులతో తొలుత కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీతో కలిసి ఆయన సమీక్షించారు. ఆయా పనులలో పురోగతిని అధికారులు, పోర్టు నిర్మాణ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టరుకు వివరించారు. పనులు త్వరగా పూర్తయ్యాలా చర్యలు తీసుకోవాలని వారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సముద్రంలోకి వెళ్లి బెర్తుల పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా కందుకూరు డివిజన్ పరిధిలోని కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు, లింగసముద్రం, వలేటివారిపాలెం 5 మండలాలు ప్రకాశం జిల్లాలో కలవడంతో అందులో భాగంగా నిర్మాణంలో ఉన్నటువంటి  రామాయపట్నం పోర్టు కూడా ప్రకాశం జిల్లా పరిధిలోకి రావడం జరిగిందన్నారు.  రామాయపట్నం పోర్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు మొదటిసారిగా రావడం జరిగిందన్నారు. పోర్టు పనులపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేస్తూ పోర్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావడం జరిగిందన్నారు. మొదటి విడత పనులు దాదాపు 80 శాతం పూర్తి కావడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి పోర్టు పనులు  పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించే విధంగా నిర్మాణ సంస్థ అయిన నవయుగ కంపెనీ పనిచేస్తున్నదన్నారు.
ప్రకాశం జిల్లాకు రామాయపట్నం పోర్టు తలమానికంగా మారనున్నదని, ఈ పోర్టు 
అందుబాటులోకి వస్తే దాని అనుబంధంగా వివిధ కంపెనీలు రావడంతో ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. పోర్టుతో పాటు బిపిసిఎల్ రిపైనరీ రావడం జరుగుతుందని, ఇప్పటికే వైజాగ్ లో ఒక బిపిసిఎల్ రిపైనరీ ఉందన్నారు. రాష్ట్రంతో పాటు ప్రకాశం జిల్లాకు రామయపట్నం, బిపిసిఎల్ ప్రాజెక్టులు చాలా ప్రాధాన్యమైనవిగా చెప్పుకోవచ్చన్నారు. పోర్టు నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వ పరంగా అవసరమైన సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, రెవెన్యూ అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. అనంతరం నిర్వాసిత ప్రజలకు తెట్టులో నిర్మించిన పునరావాస కాలనీని కలెక్టర్ సందర్శించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కోర్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, నవయుగ కాంట్రాక్టర్ కంపెనీ ప్రతినిధి నారాయణ, మ్యారీ టైమ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శివరాం, బీపిసిఎల్, ఇండోసోల్ కంపెనీల ప్రతినిధులు, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *