వ్యాధి నిరోధక టీకాల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి సకాలంలో అవసరమైన చిన్నారులు తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్యశాఖాధికారి వెంకటేశ్వర్లు కోరారు. రిమ్స్ సమావేశపు మందిరంలో సోమవారం జిల్లాలోని పీహెచ్సీ వైద్యాధికారులకు, వైద్యులకు వ్యాక్సిన్, సీజనల్ వ్యాధులపై ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా డీఎంహెచ్ఎ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి నెల శిశువుకు వ్యాక్సిన్ అందించిన తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ట్యాబ్లలో ఆర్ సీ హెచ్ పోర్టల్ లో అప్ లోడ్ చెయ్యాలని కోరారు. ప్రతి బుధ, శని వారాలలో జరుగు వ్యాధినిరోధక టీకాలు కార్యక్రమం గురించి ప్రజలకు ముందుకు తెలియచేసి తప్పని సరిగా టీకాలు తీసుకునేలా చెయ్యాలని కోరారు. సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని చెప్పారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ కమల వ్యాక్సిన్ పంపిణీలో వైద్యులు పాటించవలసిన జాగ్రత్తలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

