కంటోన్మెంట్ ఫిబ్రవరి 5
(జె ఎస్ డి ఎం న్యూస్) :
మారేడ్ పల్లిలో పేదల ఇండ్ల స్థలాలను తీసుకుని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తామని చెప్పి, నేటికి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించకపోవడంపై, ప్రభుత్వ పనితీరుపై మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. మారేడ్ పల్లి లో ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద గురువారం మొండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఆధ్వర్యంలో స్థానికుల తో కలిసి ధర్నా చేపట్టారు. ధర్నా కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరై ప్రభుత్వ అధికారులతో ఫోన్ లో మాట్లాడి తక్షణమే వీరికి న్యాయం చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ…. ప్రజల జీవితాలతో ఆడుకునే వాడు, కన్నీళ్లు పెట్టించేవాడు బాగుపడడు అని, తన రాజకీయ జీవితంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని చూడలేదని ఈ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. పేద ప్రజలకు తిట్టే కొట్టే శక్తి లేకపోవచ్చు కానీ, శపించే శక్తి ఉంటుందని అన్నారు. కేంద్రం రెండున్నర లక్షల ఇండ్లు కట్టి ఇస్తే, పేదలకు ఇచ్చే దమ్ము లేదని, కట్టిన వాటిలో ఒక్క దగ్గర కూడ డబల్ బెడ్రూంలో సదుపాయాలు లేవని విమర్శించారు. జిల్లా కలెక్టర్ సమీక్షల లో డబుల్ బెడ్ రూమ్ సమస్యలను పలుమార్లు ప్రస్తావించినా ఫలితం కనిపించలేదని తెలిపారు. గతంలో తాను 150 మంది లబ్ధిదారులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆందోళన చేస్తే, జనవరి 2, 2026న లబ్ధిదారులకు ఇండ్లు కేటాయిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.అయినా ఎందుకోసం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో లిఫ్ట్, సీసీ కెమెరాలు, లైటింగ్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పాలనలో బాధ్యత ఉండాలని సూచించారు. తాను ఏ పదవిలో ఉన్నా ప్రజల న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. నేను ప్రభుత్వ పెద్దల తో మాట్లాడుతాను అని, దీక్ష విరమించండని, వారు వినకపోతే ఏం చేయాలో నిర్ణయం తీసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బానుక మల్లికార్జున్, పిట్ల నాగేష్, కంటోన్మెంట్ అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్, విజయరామరాజు, జితేందర్ గుప్తా, కిరణ్ రెడ్డి మహేష్, డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

