కంటోన్మెంట్ విలీనంపై బిజేపీ, బిఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నారని జనతా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం ఏబుల్, ప్రధాన కార్యదర్శి అశోక్ ముదిరాజ్ అన్నారు. న్యూ బోయిన్ పల్లి లో ని జనతా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. కంటోన్మెంట్ విలీనం కోసం ఎమ్మెల్యే శ్రీగణేష్ నిరసనకు గమ్యం లేదని అందుకే విరమించుకున్నారని ఎద్దేవా చేశారు. విలీనం కోసం గతంలోనే లక్ష సంతకాల సేకరణ చేపట్టి కేంద్రం రక్షణ శాఖకు పంపినట్లు మన్నే క్రిశాంక్ కు సమాధానం చెప్పారు. బి జె పి నేత రామకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండించారు. బోర్డు కు బడ్జెట్ ఉందా ? ఉంటే వార్డుకు ఎంత ఖర్చు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కంటోన్మెంట్ లో డబుల్ ఇంజన్ సర్కారు పాలనలో కేంద్రం నుండి రావాల్సిన 1200 కోట్ల రూపాయలు ఎందుకు రావట్లేదో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కంటోన్మెంట్ బోర్డు కు రావలసిన టి.పి.టి చార్జీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు పరిధిలోని బి త్రీ, బి ఫోర్ లాండ్స్ అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కై కబ్జాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సామాన్యులపై మాత్రం బ్రహ్మస్రాన్ని వినియోగించి కూల్చివేతలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బడా బాబులకు వర్తించని నియమాలు పేదలకు ఎందుకు వర్తిస్తాయో సమాధానం చెప్పాలన్నారు. బోర్డు విలీనం కోసం ఢిల్లీలో ధర్నా చేసేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నరేష్, ఫైజల్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
