ప్రతి రైతు వ్యవసాయ యంత్ర సేవలు సులభంగా
పొందటానికి ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా యాప్ ను అందుబాటులోనికి తెచ్చిందని వక్తలు అన్నారు. తాళ్లూరు వ్యవసాయశాఖ కార్యాలయం ఆవరణలో వ్యవసాయాధికారి ప్రసాద రావు ఆధ్వర్యంలో సోమవారం యంత్ర సేవలను తెలియజేసే యాప్, ఫార్మర్ రిజిస్ట్రీ ప్రాధాన్యత తెలుపుతూ వాల్ పోస్టర్ లు విడుదల కార్యక్రమం నిర్వహించారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, సర్పంచి పీ ఎస్ శ్రీకాంత్ రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరైనారు. క్యాబ్ బుక్ చేసుకున్నట్లు యంత్ర సేవల కోసం యాప్లో బుక్ చేసుకుంటే సేవలు సులభంగా, చౌకగా పొందవచ్చని చెప్పారు. ప్రతి రైతు వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా రాయితీ పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అని అన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, ఎఈ హనుమంత రావు, ఎఈఓ రాజ సుందరి, నాయకులు రామయ్య, చాట్ల డాని తదితరులు పాల్గొన్నారు.

