ప్రకాశం జిల్లా సిఎస్ పురం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని జిల్లాసమగ్ర శిక్ష ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మరియు విద్యార్థుల సౌకర్యాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. ఎగ్జామ్ హాల్లో సమాధానాల ప్రెజెంటేషన్ కీలకమని, ప్రశ్నలకు స్పష్టమైన, క్రమబద్ధమైన సమాధానాలు రాయాలని తెలిపారు. సమయ నిర్వహణ, ఆత్మవిశ్వాసం, మరియు ఒత్తిడి నియంత్రణపై దృష్టి పెట్టాలని సూచించారు.పదవ తరగతి విద్యార్థులతో 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలు తీరును సమీక్షించి, ప్రతిరోజూ రివిజన్, మోడల్ పేపర్ల సాధన, గ్రాండ్ టెస్టుల ద్వారా లక్ష్య సాధన చేయాలని మార్గదర్శనం చేశారు.అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి, అన్ని వివరాలను సమయానికి నమోదు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల భద్రత, నాణ్యమైన విద్య, ప్రభుత్వం అందిస్తున్న ఆహారం మరియు ఇతర సౌకర్యాలలో ఎటువంటి లోపాలు తలెత్తినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ తనిఖీ ద్వారా పాఠశాల పనితీరును మరింత బలోపేతం చేయాలని జిల్లా ప్రాజెక్ట్ అధికారి అనిల్ కుమార్ తెలిపారు.

