దాతల సాయంతో అద్దంకి నియోజకవర్గంలోని దివ్యాంగులకు ఇప్పటివరకు 167 ట్రై స్కూటీలు, ప్రభుత్వం పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు 7 వేలకు పైగా సైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. సోమవారం అద్దంకి నియోజకవర్గ పర్యటనలో భాగంగా ముప్పవరం క్యాంపు కార్యాలయంలో దివ్యాంగులకు 35 ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 91 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఇప్పటి వరకు అద్దంకి నియోజకవర్గంలో మొత్తం 167 ట్రై స్కూటీలను దివ్యాంగులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పలు వ్యాపార సంస్థల సీఎస్ఆర్ నిధులతో ట్రై స్కూటీల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని పలువురు దివ్యాంగుల నుంచి అప్లికేషన్లు అందినట్లు తెలిపిన మంత్రి గొట్టిపాటి… త్వరలోనే మిగిలిన వారికి కూడా ట్రై స్కూటీలను అందించనున్నట్లు ప్రకటించారు. దివ్యాంగుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగుల పింఛన్ను రూ.6,000లకు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అనేక మంది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. చివరిగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలపై అధికారులు సత్వరం స్పందించి, పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.


