బేగంపేట ఫిబ్రవరి 24
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను కాపాడేందుకే హెల్మెట్ బ్యాంకు ను ప్రారంభిస్తున్నామని ,ఈ బ్యాంకు ద్వారా హెల్మెట్ లేని ద్విచక్ర వాహనదారులకు తాత్కాలికంగా హెల్మెట్ ను అందిస్తామని, 24 గంటల్లోపు హెల్మెట్ ని తిరిగి బ్యాంకులో జమ చేయాలని మల్కాజ్ గిరి ట్రాఫిక్ 1 డిసిపి రాహుల్ రెడ్డి అన్నారు. మంగళవారం బేగంపేటలో రోడ్డు భద్రతను మెరుగుపరిచే చర్యలలో భాగంగా మల్కాజ్ గిరి ట్రాఫిక్ పోలీసులు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. మల్కాజ్ గిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ బ్యాంకు పేరుతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారం నుంచి బేగంపేట ప్రాంతంలో అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ డిసిపి రాహుల్ రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను గుర్తించి వారి వివరాలు నమోదు చేసి వారికి తాత్కాలికంగా హెల్మెట్ ను అప్పుగా అందజేస్తామని తెలిపారు.24 గంటల్లోపు కొత్త హెల్మెట్ ను కొనుగోలు చేసి వారు అప్పుగా తీసుకున్న హెల్మెట్ ను హెల్మెట్ బ్యాంకులో తిరిగి జమ చేయాలని సూచించారు. అదేవిధంగావాహనదారుడుతో పాటు వెనుక కూర్చునే (పిల్లియన్ రైడర్లు) కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనీ అన్నారు. నాలుగు సంవత్సరాలు పైబడిన పిల్లలు ద్విచక్ర వాహనాలు పై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారుల మరణాల్లో గణనీయంగా హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్లే జరుగుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందనీ అన్నారు.వాహన తనిఖీల సమయంలో కొందరు హెల్మెట్ ను హడావిడిలో ఇంట్లో మర్చిపోయామని, మరికొందరు జుట్టు రాలిపోతుందని, తల, మెడ, నొప్పుల కారణంగా హెల్మెట్ ధరించడం లేదంటూ వివిధ రకాల సాకులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం వాహనదారులపై చలనాలు విధించడం మాత్రమే కాకుండా వాహనదారుల ప్రాణ రక్షణ పై అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఈ హెల్మెట్ బ్యాంకు కార్యక్రమం ద్వారా ప్రతి ద్విచక్ర వాహనదారుడు నిబంధనలను కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకుంటున్నమన్నారు. వాహనదారుడు వివరాలు నమోదు చేసి హెల్మెట్ ను అప్పుగా ఇస్తామని, 24 గంటల్లోపు అదే హెల్మెట్ ను తిరిగి బ్యాంకులో జమ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని త్వరలో అల్వాల్ ,తిరుమలగిరి ప్రాంతాలకు విస్తరించనున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డి సి పి( ట్రాఫిక్ 1) లక్ష్మి, ఏసిపి జి. శంకర్ రాజు, ఇన్స్పెక్టర్లు జానకి రాములు ,సర్దార్ నాయక్ ,శంకరయ్య, ఎస్సై హరీష్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.



