హైదరాబాద్ మార్చి 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు అత్యవసర పరిస్థితుల్లో పోలీసు యంత్రాంగం వేగంగా స్పందించే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపిఎస్ ఆదేశాల మేరకు ఖైరతాబాద్ జోన్ పరిధిలో ప్రత్యేక మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. ఖైరతాబాద్ జోన్ డిసిపి కె. శిల్పావల్లి ప్రత్యక్ష పర్యవేక్షణలో అర్థరాత్రి తెలంగాణ సెక్రటేరియట్ పరిసరాల్లో ఈ కసరత్తు జరిగింది.ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన హోంగార్డుల నుండి ఏసిపి స్థాయి అధికారుల వరకు సుమారు 275 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన లేదా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, అతి తక్కువ సమయంలో సిబ్బంది అందరూ నిర్దేశిత ప్రాంతానికి ఎలా చేరుకోవాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. జోనల్ కంట్రోల్ రూమ్ సమన్వయంతో, హోంగార్డుల నుండి ఏసిపిల వరకు ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను ఎలా నిర్వహించాలో వివరించారు. అలాగే అత్యవసరపరిస్థితుల్లో అవసరమయ్యే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, రాయట్ గేర్ (Riot Gear), ఫైర్ బాల్స్ వంటి పరికరాల పనితీరును మరియు లభ్యతను స్వయంగా తనిఖీ చేశారు. అర్థరాత్రి సమయంలో సెక్రటేరియట్ వంటి కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు మరియు పోలీసుల అప్రమత్తతను డిసిపి స్వయంగా పర్యవేక్షించి, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా డిసిపి కె. శిల్పావల్లి మాట్లాడుతూ ప్రజల రక్షణే పోలీసుల ప్రథమ కర్తవ్యం అన్నారు. ఏ సమయంలోనైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే బలగాలు తక్షణమే మోహరించడం అత్యంత కీలకం. ఇటువంటి డ్రిల్స్ వల్ల పోలీసు బలగాల సంసిద్ధత పెరగడమే కాకుండా, ప్రజలకు సకాలంలో రక్షణ కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణలో ఖైరతాబాద్ జోన్ పోలీసులు చూపుతున్న నిరంతర కృషిని ఆమె అభినందించారు. ఉన్నతాధికారుల మరియు ప్రజల అంచనాలకు అనుగుణంగా మరింత మెరుగ్గా పనిచేయాలని సిబ్బందిని ఉత్సాహపరిచారు.

