హైదరాబాద్, మార్చి 02,
(జే ఎస్ డి ఎం న్యూస్) : అంబర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ముగ్గురి సామూహిక ఆత్మహత్య కేసులో, అప్పుల వసూలు కోసం వేధింపులకు పాల్పడి మరణానికి కారణమైన నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారులను సికింద్రాబాద్ జోన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సికింద్రాబాద్ జోన్ డి సీ పీ రక్షితా మూర్తి వివరాలు వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం గం 12లకు బాధితురాలు కడ్కేకర్ అమూల్య పిర్యాదు మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని అన్నారు.బాపూనగర్ లోని తమ నివాసంలో తండ్రి ఖద్కేకర్ రామ్ రాజ్ (54)తల్లి మాధవి,తమ్ముడు ఖద్కేకర్ శశాంక్ రాజ్ లు విగత జీవులుగా పడి ఉన్నట్లు ఆమె పిర్యాదు లో తెలియజే సారని ఆన్నారు.తండ్రి,తమ్ముడు వేర్వేరు గదుల్లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఉన్నారని,తల్లి మంచం పై మృతి చెంది ఉందన్నారు.అయితే ముందుగా ఈ కేసును సెక్షన్ 194 బి ఎన్ ఎస్ ఎస్ కింద నమోదు చేయగా ఘటనా స్థలంలో లభించిన ఆత్మహత్య లేఖల ఆధారంగా వడ్డీ వ్యాపారుల వేధింపులే మరణానికి కారణమని తేలిందన్నారు.మృతులు మల్లాపూర్ చక్రి పురంలో కింగ్స్ బిర్యాని హోటళ్లను నడపడానికి సుమారు 57లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారన్నారు.దానికి నిందితులు అక్రమంగా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడ్డారని అన్నారు.బలవంతంగా ఖాళీ చెక్కులు,ప్రామిసరీ నోట్లు ,ఎం ఓ యూ అసలైన భూమి పత్రాలను స్వాధీనం చేసుకోవడం, ఫోన్ ద్వారా నిరంతరం బెదిరింపులకు పాల్పడటం ,ఇంటికి వచ్చి బహిరంగంగా పరువు తీస్తామని భయపెట్టడం ,హెచ్చరికలు చేయడం చేశారన్నారు.ఈ కేసులో నిందితులైన మౌలాలికి చెందిన రియల్ ఎస్టేట్ ,స్క్రాప్ వ్యాపారం చేస్తున్న మహమ్మద్ వసి ఉజ్ జమాన్ అలియాస్ ఇర్ఫాన్ (57),మౌలాలి కి చెందిన పి.రాజశేఖర్ రెడ్డి (55), పాత సఫిల్ గూడ కు చెందిన మహమ్మద్ నవాజ్ (50),సయ్యద్ మజీద్ హైదర్ (53)లను అరెస్ట్ చేశామన్నారు.మృతులు సంతకం చేసిన 12ఖాళీ చెక్కులు,6 ఖాళీ ప్రామిసరీ నోట్లు ,3 ఒప్పందాలు (ఎం ఓ యూ లు)లోన్ అగ్రిమెంట్లు,యాదాద్రి భువనగిరి జిల్లా గాంధీ మల్ గ్రామం లో 3ఎకరాల వ్యవసాయ భూమి అసలు పత్రాలు ,మృతులను బెదిరించడానికి ఉప యోగించిన మొబైల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు.ఈ ఆపరేషన్ లో డి సి పి జె.నర్సయ్య, ఏ సి పి గైరా జగన్ ,సి ఐ టి.కిరణ్ కుమార్,డి ఐ మహమ్మద్ హఫీజుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు.వారిని డి సి పి రక్షితా మూర్తి అభినందించారు.

