సాహిత్యరంగంపై మొల్లమాంబ తనదైన ముద్ర వేశారని జిల్లా రెవెన్యూ అధికారి బి.చిన ఓబులేసు
కొనియాడారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ 586వ జయంతి ఉత్సవం శుక్రవారం ప్రకాశం భవనంలో ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారికంగా నిర్వహించిన ఈ ఉత్సవములో జిల్లా బిసి సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, పలువురు కవయిత్రులు, శాలివాహన సంఘం ప్రతినిధులు పాల్గొని మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ సాహిత్య రంగంలో మొల్లమాంబ సేవలను కొనియాడారు. ఒంగోలులో ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం తరపున సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. శాలివాహన సంఘము ఆధ్వర్యంలో ప్రకాశం భవనంలో ప్రత్యేక చలివేంద్రం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులోకి అందుబాటులోకి తీసుకురావటం మొల్లమాంబ ప్రతిభకు నిదర్శనం అన్నారు. బిసి సామాజిక వర్గాలకు ఆదరణ పథకం ద్వారా సబ్సిడీతో రుణాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిర్మల జ్యోతి మాట్లాడుతూ మొల్లమాంబ జీవిత చరిత్రను వివరించారు.
ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ, ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి, ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు పరాంకుశం కృష్ణవేణి, గాయని చల్లా నాగేశ్వరమ్మ, తదితరులు పాల్గొన్నారు. శాలివాహన సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులైన ఐలాపురం వెంకయ్య, ‘ విక్కీ ‘ నాగేశ్వరరావు మృతికి సంతాపంగా ఈ కార్యక్రమంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
