బేగంపేట మార్చి 14,(జేఎస్ డిఎం న్యూస్) :
ఎంతో భక్తితో దేవునికి వెలిగించిన దీపం సాయంత్రం వాకింగ్ వెళ్లి వచ్చేసరికి ఇల్లంతా బుగ్గి చేసిన ఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అందిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బేగంపేట మయూరి మార్గ్ మే ఫ్లోవర్ అపార్ట్మెంట్ 208 ప్లాట్ లో మహేష్ కుమార్ శాస్త్రి దంపతులు నివసిస్తున్నారు. శనివారం వారు ఇంట్లో దేవునికి దీపం వెలిగించారు. సాయంత్రం వాకింగ్ కి వెళ్లారు. ఈ సమయంలో దీపం ఎక్కడ అంటుకుందో ఏమో గాని సాయంత్రం సుమారు గం 6.50 నిమిషాల సమయంలో అపార్ట్మెంట్ నుంచి దట్టమైన పొగతో పాటు పెద్దగా మంటలు బయటకు వచ్చాయి.ఇది గమనించిన బి ఆర్ ఎస్ నాయకులు టి .శ్రీహరి వెంటనే అక్కడకు చేరుకుని సమాచారాన్ని పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇదే సమయంలో హైడ్రా సిబ్బంది కూడా రంగంలోకి దిగారు. అగ్నిమాపక సిబ్బంది
రెండు అగ్నిమాపక శక టాలతో అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అపార్ట్మెంట్లో నివసించేవారిని బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి అప్రమత్తం చేశారు. ఏదైనా అనుకోని అత్యవసర పరిస్థితి ఎదురైతే ఎదుర్కొనేందుకు అంబులెన్స్ కూడా అపార్ట్మెంట్ వద్ద అందుబాటులో ఉంచారు. అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారిని క్షేమంగా అక్కడి నుంచి బయటికి పంపించారు. ఆ మార్గంలో వచ్చే ట్రాఫిక్ ని కూడా మళ్ళించారు. ఎక్కువ సంఖ్యలో జనాలు గుమీ కూడకుండా ఇన్స్పెక్టర్ సైదులు సిబ్బంది చర్యలు చేపట్టారు. రంగంలోకి దిగిన హైడ్రా సిబ్బంది ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ లను బయటకు తీసుకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అపార్ట్మెంట్ కు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. 208 లో అంటుకున్న మంటలు 308 కి ఎగబాకాయి .ఈ సంఘటనతో దట్టమైన పొగతో పాటు పైన కిటికీల అద్దాలన్నీ పగిలిపోయాయి. గోడలన్నీ పొగతో నిండిపోయాయి. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం ఎంతవరకు జరిగిందనే అంచనా వేయలేదు. ప్రాణ నష్టం జరగకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు , పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన టిఆర్ఎస్ నాయకుడు టి శ్రీహరి, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ,హైడ్రా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సకాలంలో వారు స్పందించకుంటే పెద్ద ప్రమాదం జరిగేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.




