మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతీ రోజు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం12.45 గంటల వరకు నిర్వహించు పదవ తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియచేసారు. పరీక్షల సమయంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ తరుపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సిబ్బంది తో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నందున పరీక్షా కేంద్రాలు ఆవరణలో బయట వ్యక్తులు లేకుండా చర్యలు తీసుకున్నామని, పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తున్నామని తెలిపారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 108 కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని, పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్ అధికారులకు ఎస్పీ గారు ఆదేశించారు.
పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణ నిర్వహించేందుకు ఇతర శాఖల సమయంతో పటిష్టమైన ఏర్పాట్లు చేసామని, మొబైల్ పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసామని, పరీక్షలు జరుగు సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్లు నిరంతరం తిరుగుతూ ఉంటాయని, పరీక్షా సమయంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయానికి హాజరు కావాలని, కావున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించి సరైన సమయంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా చూడాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులతో పాటు పరీక్ష విధులు నిర్వహించే అన్ని శాఖల సిబ్బంది పదవ తరగతి పరీక్షల నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు మరియు పరీక్షలకు కేటాయించిన సిబ్బంది తప్ప ఇతర సిబ్బంది లేదా వ్యక్తులు ఉండరాదని తెలిపారు. అలాగే చిట్టీలు, పుస్తకాలు వంటి వాటిని ఉపయోగించి మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్కు విద్యార్థులు ఎవరైనా పాల్పడినా, లేదా వారికి ఎవరైనా సహకరించినా, వారి పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ , 10వ తరగతి మార్చి 2026 పరీక్షలు మార్చి 16 నుండి 28 వరకు జరుగును. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయి. పరీక్షా నియమ నిబంధలు తప్పనిసరిగా పాటించాలి.
జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన వెంటనే డయల్ 100/112 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ 9121102266 కు సమాచారం అందించాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియచేసారు.
