తెలుగుజాతికి గుర్తింపు కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడేలా కృషిచేసిన పొట్టి శ్రీరాములు త్యాగనిరతి, పోరాట స్ఫూర్తి ఎందరికో ఆదర్శమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి
అన్నారు. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఒంగోలు నగరంలోని సి.వి.ఎన్. రీడింగ్ రూమ్ సమీపంలోని విగ్రహానికి కలెక్టర్ పి.రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావు, గంగాడ సుజాత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ ముప్పవరపు సుచిత్ర, డీసీఎంఎస్ చైర్మన్ కాశిరెడ్డి, ఇతర ప్రముఖులతో కలిసి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుజాతి కోసం తన ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా లక్ష్యసాధనకు పూనుకున్న పొట్టి శ్రీరాములు నేటి తరానికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆ మహనీయుని సేవలను తెలుగు ప్రజలందరూ గుర్తించుకునేలా అమరావతిలో 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం అసాధారణ నిర్ణయం తీసుకుని దానిని సాధించేలా చిత్తశుద్ధితో ముందుకు సాగిన పొట్టి శ్రీరాములు మన అందరికీ గర్వకారణమన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష, అనంతరం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుతో అడుగులు పడ్డాయి అన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సివిఎన్ రీడింగ్ రూము సెంటర్లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రియాజ్ మాట్లాడుతూ తెలుగు ప్రజలపై పొట్టి శ్రీరాములుకు ఉన్న ప్రేమకు ఆయన పోరాటమే నిదర్శనం అన్నారు.
అనంతరం ప్రకాశం భవనంలోని గ్రీవెన్స్ హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు. అమరావతిలో కాంస్య విగ్రహ ఆవిష్కరణ, అనంతరం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల ప్రసంగాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీరు వీక్షించారు. ప్రకాశం భవనంలో జరిగిన కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పి. విజయ్ కుమార్, డి.ఆర్.ఓ. బి.చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సింగరాయకొండలో…
అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సింగరాయకొండలో ఆయన విగ్రహానికి
మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి
పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం… అమరావతిలో జరుగుతున్న పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని లైవ్ లో మంత్రి డా.డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు వీక్షించారు.

