మాదక ద్రవ్యాల నిర్మూలనే, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడి లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం, బురేపల్లి కాలనీలో మరియు పరిసర ప్రాంతంలో విస్తృత స్థాయిలో ఆపరేషన్ వజ్రా ప్రహార్ లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ ఇన్స్పెక్టర్ శేషగిరి, 10 ఎస్సైలు మరియు 50 పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ పరికరాల ద్వారా అనుమానితుల తనిఖీ చేశారు.
తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇళ్లు, దుకాణాలు, గంజాయి కేసుల్లోని పాత ముద్దాయిల ఇళ్లు మరియు ఇతర ప్రదేశాలను సోదాలు చేశారు. సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 27 మోటార్ సైకిల్ మరియు ఒక ఆటో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొందరు వాహన యజమానులకు చలానాలు విధించారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, మహిళలపై నేరాలు మరియు వాటి శిక్షల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. తదనంతరం “డ్రగ్స్ వద్దు బ్రో” అనే నినాదంతో స్థానిక ప్రజలతో కలిసి గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. యువత, వ్యాపారులు, కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని “గంజాయిని పారదోలుదాం – డ్రగ్స్ నిర్మూలనకు కట్టుబడుదాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.
ఒంగోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ గంజాయి మరియు మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, ఉపాధి వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ విక్రయం లేదా వినియోగానికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించాలని సూచించారు.

