ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా అద్దంకి ఆర్టిసీ బస్టాండ్ నిర్వహణపై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
చెప్పారు. మంగళవారం ఆయన ఈ బస్టాండు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఇందులోని పార్కింగ్, వాణిజ్య దుకాణాలు, టాయిలెట్లు, త్రాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. టాయిలెట్ల సంఖ్యను పెంచాలని, దుకాణాల నిర్వహణలో క్రమ పద్ధతి ఉండాలని, నిర్ణీత ధరలకు మించి వస్తువులను విక్రయించకుండా పర్యవేక్షించాలని కలెక్టర్ చెప్పారు. కాగా, ఆర్టీసీ ఆర్ఎం జి.సత్యనారాయణ వీటికి సంబంధించిన వివరాలను కలెక్టరుకు వివరించారు. ఈ ప్రాంగణంలో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ ప్రతిపాదనలు త్వరగా ఆమోదం పొందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ రామ్మోహన్ రావు, సూపర్వైజర్ ఫణి కుమార్, ఆర్డీవో జాన్సన్, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర, తహసిల్దార్ చరణ్ , ఇతర అధికారులు ఉన్నారు.

