హైదరాబాద్ ఏప్రిల్ 1
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో పోలీసు వ్యవస్థపై అవగాహన పెంచడంతో పాటు వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో హైదరాబాద్ నగర పోలీసు విభాగం ‘సీపీతో ఒక రోజు’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 8 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పోలీసుల పనితీరును క్షేత్రస్థాయిలో తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రతిరోజూ ఒక పాఠశాల నుంచి ప్రతిభగల 20 మంది విద్యార్థులను (10 మంది బాలురు, 10 మంది బాలికలు) ఎంపిక చేసి, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలీసు విభాగంలోని వివిధ విభాగాలనుసందర్శింపజేస్తారు.బషీర్ బాగ్ లోని సీసీఎస్ కార్యాలయంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ‘సీపీతో ఒక రోజు’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. మంగళహాట్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలోనే బాధితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిష్కార ప్రక్రియను వారికి ప్రత్యక్షంగా వివరించారు.అనంతరం వారికి పుస్తకాలతో పాటు ప్రశంసాపత్రాలను అందజేశారు. అంతకుముందు వారు పర్యటనలో భాగంగా బంజారాహిల్స్లోనిఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తో పాటు మెయిన్ పీసీఆర్, ఐటీ సెల్, స్పెషల్ బ్రాంచ్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్ వింగ్, సీఏఆర్ హెడ్క్వార్టర్స్ వంటి కీలక విభాగాలను
సందర్శించారు. ఆయా విభాగాల ఉన్నతాధికారులు విద్యార్థులతో నేరుగా ముచ్చటించి, నేరాల నియంత్రణలో సాంకేతికత పాత్ర, మహిళా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల బాధ్యతలను వివరించారు. ప్రజలతో పోలీసులు ఎలా మమేకమవుతారో విద్యార్థులు స్వయంగా చూసి తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. పోలీస్ అంటే కేవలం నేరాలను అదుపు చేసే యంత్రాంగం మాత్రమే కాదు. సమాజ భద్రతకు భరోసా ఇచ్చే సేవా వ్యవస్థ అని నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్,
పేర్కొన్నారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే చట్టం పట్ల గౌరవం, సామాజికబాధ్యతను పెంపొందించడమే ‘సీపీతో ఒక రోజు’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన వివరించారు. ముఖ్యంగా సైబర్ నేరాలు,మాదకద్రవ్యాల ముప్పు వంటి సామాజిక రుగ్మతలపై వారిని చైతన్యపరుస్తూనే.పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఈ పర్యటన విద్యార్థుల్లో సరికొత్త ఆలోచనలను రేకెత్తించి,
వారి ఉజ్వల భవిష్యత్తుకు దిక్సూచిలా నిలుస్తుందని ఆయన ఆకాంక్షించారు.
మహిళా భద్రత విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.




