జిల్లాలో పారిశ్రామికీకరణను మరింత వేగవంతం చేసేలా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో ఈ దిశగా పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములు, ఇతర వనరులను గుర్తించడంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను పెట్టుబడిదారులకు వివరించేలా ఇప్పటినుంచే దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశ్రామిక అభివృద్ధి, యువతకు నైపుణ్య శిక్షణపై సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నందున ఈ సదస్సును విజయవంతం చేసేలా ఆ యూనివర్సిటీని కూడా సంప్రదించాలని చెప్పారు. వివిధ రంగాలలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారులను గుర్తించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మదన్, నెడ్ క్యాప్ అధికారులు పాల్గొన్నారు.

