జిల్లాలో ప్రజల నుంచి అందుతున్న పిజిఆర్ఎస్ ఫిర్యాదులను నిర్దిష్ట గడువులో పరిష్కరించేలా ప్రత్యేక దృష్టిలో సారించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మహేష్, రమేష్, డిపిఓ వెంకటేశ్వర రావు లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ సమస్యలపై పిజిఆర్ఎస్ లో ధరఖాస్తులను నాణ్యతతోపాటు నిర్ధేశించిన సమయంలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుండి వివిధ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు అందించిన వినతులను పరిశీలించి నాణ్యతతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అర్జీలు రీ-ఓపెన్ కాకుండా క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు.
ప్రజల సమస్యలు పెండింగ్లో ఉండకుండా ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యంగా తీసుకుని తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రత్యేకంగా ఎక్కువకాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్రంగా పరిశీలన చేసి పరిష్కారం చూపాలని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా అధికారులు స్పందించాలని, ప్రతి శాఖాధికారి పెండింగ్ ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నాణ్యతకు పెద్దపీట వేయడంతో పాటు ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండార్స్ మెంట్ ఇవ్వాలని తెలిపారు. ఈరోజు నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో 268 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

