హైదరాబాద్. ఏప్రిల్ 9
(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలోని కీలక ప్రాంతాల్లో ఒకటైన బేగంపేటలో గురువారం అధికారులు ఫుట్ పాత్ , రోడ్డు ఆక్రమణలను జెసిబిల సహాయంతో తొలగించారు. గురువారం ఉదయం పెద్ద సంఖ్యలో బేగంపేటకు చేరుకున్న అధికారులు బేగంపేట శ్యామ్లాల్ బిల్డింగ్ ఆర్బిఐ క్వార్టర్స్ ముందు ఉన్న ఫుట్ పాత్ ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలను పూర్తిగా నేలమట్టం చేశారు. దీంతో ఫతే నగర్ వరకు ప్రయాణించే వాహనదారులకు ఇకపై ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. శ్యాంలాల్ బిల్డింగ్ తో పాటు అల్లం తోట బాయి, ప్రకాశం నగర్లో ఫుట్ పాత్ , రోడ్డు ఆక్రమణలను అధికారులు తొలగించారు. మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో ఆక్రమణల తొలగింపు డ్రైవ్ నిర్వహించారు.
రోడ్లపై వెలుస్తున్న అక్రమ కట్టడాలు, ఫుట్పాత్ల ఆక్రమణల వల్ల నిత్యం ఈ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ అధికారులు, బేగంపేట్ లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో రంగంలోకి దిగారు. రహదారికి అడ్డంగా ఉన్న ఆక్రమణలను తొలగించి, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా మార్గాన్ని సిద్ధం చేశారు. ప్రజల సౌకర్యం కోసం, నిరంతర ట్రాఫిక్ ప్రవాహాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.
ఈ కీలక ఆపరేషన్లో ట్రాఫిక్-1 డీసీపీ శ్రీ కె. రాహుల్ రెడ్డి (ఐపీఎస్) స్వయంగా పర్యవేక్షించారు. వారితో పాటు ఆల్వాల్ సర్కిల్ అసిస్టెంట్ టౌన్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి, బేగంపేట్ ఏసీపీ (లా అండ్ ఆర్డర్) గోపాల కృష్ణ, తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు. బేగంపేట్, తిరుమలగిరి, ఆల్వాల్ పరిధిలోని పోలీస్ ఇన్స్పెక్టర్లు సైదులు, జానకి రాములు, సర్దార్ నాయక్, పవన్ కుమార్ రెడ్డిలు తమ సిబ్బందితో కలిసి ఆక్రమణలను సమర్థవంతంగా తొలగించారు.
ఈ సందర్భంగా తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు మాట్లాడుతూ.బహిరంగ రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ ఆక్రమణల వల్ల సామాన్య ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నారని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలుతీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ప్రయోజనం కోసం, రద్దీ లేని ప్రయాణాన్ని అందించేందుకు ట్రాఫిక్ విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని వారు పునరుద్ఘాటించారు. ఈ డ్రైవ్తో రహదారి విస్తీర్ణం పెరగడమే కాకుండా, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయిందన్నారు.



