హైదరాబాద్ ఏప్రిల్ 9 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
నగరంలోని నెక్లెస్ రోడ్డు జలవిహార్ వాటర్ పార్కులో బుధవారం జరిగిన ఆరో ప్లాంట్ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరు చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లేక్ పోలీసుల కథనం మేరకు
జలవిహార్లోని ఆర్వో ప్లాంట్ సమీపంలో ఉన్న వాటర్ ట్యాంకును శుభ్రం చేసే పనుల్లో కార్మికులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో కెమికల్ డబ్బాను తెరిచేందుకు గోడకు కొట్టడంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు తీవ్రతకు పక్కనే ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన గంగులయ్య అలియాస్ లక్ష్మణ్ (50) అనే వ్యక్తి రెండు చేతులు మణికట్టు వరకు తెగిపోయాయి. శరీరంలోని ఇతర భాగాలు, కాళ్లు కూడా తీవ్రంగా కాలిపోయాయి. లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరికి కూడా తీవ్రగాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సోమాజిగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మణ్ మృతి చెందాడు. మిగిలిన ఇద్దరిలో ఒకరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.లక్ష్మణ్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కెమికల్ డబ్బాను అజాగ్రత్తగా తెరవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
జలవిహార్లో ఘోర ప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డఒకరి మృతి.
09
Apr