భారీ వర్షాలు, తుఫాను వచ్చినా ప్రజలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందటంలో ఎలాంటి జాప్యం జరగరాదన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. శనివారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పింఛన్ల కోసం ఏడాదికి రూ.32 వేల కోట్లను పేదలకు ఇస్తున్నామన్నారు. పేదల కళ్ళలో ఆనందం చూడాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు ఆశయమని మంత్రి స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు ఆయన చెప్పారు. మొంథా తుఫాను సమయంలో ప్రాణ నష్టం జరగకుండా ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షించి అధికారులకు దిశ నిర్దేశం చేసినట్లు వివరించారు. చరిత్రలో ఎన్నడు లేనట్లుగా ప్రభుత్వం చురుకుగా వ్యవహరించడం వలన ప్రాణనష్టాన్ని నివారించగలిగామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, ఎంపీడీవో దేవసేనకుమారి, తహసిల్దార్ ఆంజనేయులు, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

