భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయులు సైతం ఎంతో మక్కువతో అనుసరిస్తూ, సనాతన భారతీయతను, భారతదేశంలోని ఆధ్యాత్మిక, ధ్యాన, యోగ సంపదను పాటిస్తూ ప్రపంచానికి చాటి చెప్పడానికి ఎందరో విదేశీయులు భారతదేశంలో తమ ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు. వారిలో ఆస్ట్రేలియాకు చెందిన 31 సంవత్సరాల జోర్డి మోరియా ఒకరు. యోగా, ధ్యాన గురువు భారతదేశ పర్యటనకు ఒరిస్సా లోని పూరి విచ్చేసి జగన్నాధ స్వామివారి విరాట్ స్వరూపాన్ని దర్శించి అనంతరం పాదయాత్రగా కాలినడకన దక్షిణాది కన్యాకుమారి కి గత 40 రోజులుగా ప్రయాణిస్తూ ఆదివారం సాయంత్రం ఒంగోలు నగరం చేరారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల ఆర్యవైశ్య భవన్ నందు బస చేసి సోమవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కన్యాకుమారి వైపు సాగిపోయారు.
ఈ సందర్భంగా జోర్డి మోర్ మీడియా ప్రతినిధికి తమ వివరాలను తెలిపారు. భారతదేశం యొక్క ధర్మము, వేద పరంపర, ఋషి పరంపర, గురుపరంపర, తనను ఎంతో ఆకర్షించినవని, ఆదిశంకరాచార్యులు వారి ఆధ్యాత్మిక భావన తనను ఎంతో ప్రభావితానికి గురిచేసిందని, ప్రతిరోజు తాను యోగా ధ్యానము చేస్తూ అంతర్ముఖముతో ఉండగా ఒకనాడు ఆదిశంకరాచార్యుల పిలుపు మేరకు ఆస్ట్రేలియా నుంచి ఒరిస్సా రాష్ట్రంలో పూరి జగన్నాధుని దర్శించి అక్కడి నుంచి కన్యాకుమారి వరకు భారతదేశ మొత్తం కూడా కాలినడకన పాదయాత్ర చేయాలని సంకల్పించి, ఆదిశంకరాచార్యులు యొక్క మహత్తును, భారత దేశంలో నడియాడిన ఋషుల అడుగులలో అడుగులు వేస్తూ భారత దేశం యొక్క ధర్మాన్ని, జ్ఞానాన్ని నేర్చుకోవాలనే సంకల్పంతో బయలుదేరానని తెలిపారు. దక్షిణం వైపుగా కావలి, నెల్లూరు, తిరుపతి మీదుగా రామేశ్వరం, కన్యాకుమారి వరకు వెళ్లి కేరళలోని శ్రీ ఆది శంకరాచార్యుల వారి జన్మస్థలం కాలడి దర్శించి అటు నుంచి హిమాలయాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. మీరు మరలా మీ స్వస్థలానికి ఎప్పుడు వెళతారని ప్రశ్నించగా ఆ విషయాన్ని ఇంతవరకు నేను ఆలోచించలేదని అంతా భగవదేచ్ఛగా సమాధానం ఇచ్చారు.
ఒక దృఢ సంకల్పంతో గత 40 రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ తన యొక్క దీక్షాధక్షతలతో, ఆధ్యాత్మిక భావనతో ముందుకెళ్తూ భారతీయ ధర్మాన్ని, ధర్మ జ్ఞానాన్ని, ధర్మ భూమి, కర్మభూమి, జ్ఞానభూమి ఐన భారత దేశంలోని పవిత్ర క్షేత్రాలను దర్శించాలి, జ్ఞానసముపార్జన చేయాలి అని భారతదేశం వచ్చిన విదేశీ వనిత జోర్డీ మోర్ మన యువతకు మార్గదర్శిగా మన దేశ ఔన్నత్యాన్ని తెలిపారని, మన ధర్మం ఎంత గొప్పదో ఇతర దేశస్తులు తెలుసుకొని ఆచరించే పరిస్థితి మన యువతలో మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల పట్ల అవగాహన కలగాలని ఉన్నతమైన మన ఆధ్యాత్మికతను అనుసరించి ఆచరించాల్సిన విషయం బోధపడుచున్నదని తెలిపారు. మన యువత మన ధర్మం వైపు అడుగులు వేస్తూ ఉంటే మన భారతదేశం ఎప్పుడో విశ్వ గురువుగా మారి ఉండేదని యోగా గురు గంధవళ్ల బాలసుబ్రమణ్యం తెలిపారు. ఈ దిశలో ఆవిడ యాత్ర సఫలీకృతం కావాలని ఆవిడ అనుకున్న లక్ష్యం నెరవేరాలని జ్ఞాన గంగా స్రవంతిలో మునిగి తేలాలని ఆవిడ కోరికను అందరం కూడా బలపరుస్తూ ఆమె యాత్రకు సహకరిస్తూ ముందుకి దోవ చూపాలని, భారతీయులుగా హిందూ ధర్మాన్ని ఆచరించే వారిగా అది మన ధర్మం మన కర్తవ్యం బాధ్యతగా భావించాలని తెలిపారు.
జోర్డీ మోర్ వెంట పతంజలి యోగ రాష్ట్ర అధ్యక్షులు బాలుజీ యోగాచార్య, జిల్లా సభ్యులు సోమ సుబ్బారావు, దేసు వెంకయ్య, బోయపాటి రవి, రాధా రమణ గుప్తా జంధ్యం, ధనిశెట్టి రాము, పెనుగొండ శ్రీనివాస్, తమ్మన ఆంజనేయులు, తుమ్మపూడి బుచ్చిబాబు, మిరియాల కృష్ణ, సుబ్బయ్య శర్మ తదితరులు డిపో వద్ద నుండి రామనగర్ దాకా నడిచారు.మార్గమధ్యలో యం.పి మాగుంట శ్రీనివాసులరెడ్డి జోర్డి మోర్ ను అభినందించారు.


