వందల సంవత్సరాల తర్వాత అయోధ్యలో శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ వారిచే దివ్యమైన భవ్య శ్రీ రామ మందిరం నిర్మాణం జరిగి జనవరి 22వ తేదీన శ్రీ బాల రాముని ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సందర్భంగా దేశంలోని ప్రజలందరినీ రామ జన్మభూమి అయోధ్యకు రావాలని ఆహ్వాన పత్రికలు పంపుతూ, అయోధ్యలో రామశిలా పూజిత అక్షంతలను ప్రతి గృహానికి పంపాలని నిర్ణయించుకొని ఒక పటిష్టమైన సమూహం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, విశ్వహిందూ పరిషత్ తదితర హిందూ ధార్మిక సంస్థలు అన్నిటినీ భాగస్వామ్యం చేస్తూ ప్రతి గృహానికి అక్షింతలను ఆహ్వాన పత్రాలను పంపించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, తెలుగువారు అందరూ అయోధ్య లో బాల రాముని ప్రతిష్థాపనోత్సవం కొరకు ఎదురు చూస్తున్న సమయంలో అరబ్ దేశమైన ఒమన్ లోని సహార్ పట్టణంలోని తెలుగువారు కె. కనకదుర్గ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యములో వచ్చిన శ్రీరామ శిలా పూజిత అక్షంతలను తీగల సత్యవతి ద్వారా పొంది మంగళవారం ఒమన్ లో తమ గృహములో స్ధానిక హిందువుల సహాయముతో అక్షంతలను వృద్ధి చేశారు. వానిని తాము ఉంటున్న అరబ్ దేశములోని వివిధ పట్టణాలలో ఉన్న పలువురు ప్రవాస భారతీయుల కుటుంబాలకు పంపిణి చేశారు.
ప్రవాస భారతీయులు కె. కనకదుర్గ, శ్రీదేవి, సునీత, దివ్య, ప్రశాంతి, కళ్యాణి, సుహాసిని, జయశ్రీ, ధన, సుజాత తదితరులు శ్రీరామ జయరామ జయజయ రామ అంటూ అక్షంతల వృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు.


