జిల్లాలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వసం చేసి, చోరికి పాల్పడుతున్న దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు ట్రాన్స్కో విజిలెన్స్ సీఐ బిటీ నాయక్, దర్శి ఈఈ అబ్దుల్ కరీంలు తెలిపారు. తాళ్లూరు మండలం తురకపాలెంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఒకే సారి నాలుగు చోరీకి గురికావటంతో స్పందించిన అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం తాళ్లూరు విద్యుత్ సబ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో ట్రాన్స్కో విజిలెన్స్ సీఐ బిటీ నాయక్ మాట్లాడుతూ… ఇటీవల కాలంలో తరచుగా ఉమ్మడి ప్రకాశంజిల్లాలో తాళ్లూరు, ముండ్లమూరు, అద్దంకి, బల్లికురువ, జె పంగులూరు మండలాలలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు పగుల కొట్టి చోరీలకు పాల్పడుతున్నారని అన్నారు. తక్షణమే స్పందించిన ట్రాన్స్కో చీఫ్ విజిలెన్స్ అధికారి లావణ్య లక్ష్మి ఆదేశాలమేరకు ఒంగోలు ఎస్ఈ సత్యనారాయణ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు పాత నేరస్తులపై నిఘా ఉంచినట్లు చెప్పారు. పాత విద్యుత్ వస్తువుల కొనుగోలు చేసే వారి పట్ల కూడ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అటువంటి వారి ఏవైనా పాత వస్తువులు అమ్ముతుంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పొలాల పరిసరాలలో ఎవరైనా పరిచయం లేని వ్యక్తులు సంచరిస్తుంటే తక్షణమే స్థానిక పోలీసులు, విద్యుత్ శాక అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో విద్యుత్ ఎడీ కె పిచ్చయ్య, ఎఈ వీర బ్రహ్మం, ఎస్సై విజయకుమార్, ఎఎస్పై మోహనరావు, ఎస్ఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


