పర్యావరణాన్ని కాపాడుతున్న చెట్టు… మన కన్నతల్లి లాంటిదని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టు నాటి దాని సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమాల్లో భాగంగా ఉపాధి హామీ పధకం క్రింద మంగళవారం ఒంగోలు నియోజక వర్గం, కరవది గ్రామంలోని పి.ఆర్.ఆర్. జిల్లా పరిషత్ హై స్కూలులో “ప్లాంట్ ఫర్మదర్” పేరుతో మొక్కలు నాటే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్కూలు ప్రాంగణంలో ఈ సందర్భంగా విద్యార్ధులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తల్లిని ఎంత ప్రేమగా చూసుకుంటామో మనం నాటిన మొక్కను కూడా అంతే ప్రేమతో చూసుకోవాలని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు: జిల్లా యంత్రాంగం కూడా ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తామంతా మొక్కలు నాటుతామని, వాటిని జాగ్రత్తగా పెంచుతామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతోనూ, ఉపాధి పథకం కూలీలతోనూ, స్థానికులతోనూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్ధులు 100 కొబ్బరి మొక్కలు నాటారు. అనంతరం స్కూలు ప్రాంగణాన్ని, విద్యార్ధులకోసం తయారు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. రాగిజావ ను ఆమె రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పి.డి. అర్జునరావు, జడ్.పి. సి.ఈ.ఓ. మాధురి, డి.పి.ఓ. ఉషారాణి, ఆర్.డి.ఓ. సుబ్బారెడ్డి, ఎం.ఈ.ఓ. కిషోర్, ప్రిన్సిపాల్ పి.వి.రవికుమార్, సర్పంచ్ డి.కోటేశ్వరరావు, ఉప సర్పంచ్ పి. శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
