ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు రైతులకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా వ్యవసాయ అధికారులకు చెప్పారు. బుధవారం ఆమె పేర్నమిట్టలో పర్యటించి స్థానిక మిరప పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ఈ-పంట నమోదు అయిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులందరూ ఈ-పంట నమోదు చేసుకునేలా చూస్తున్నామని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు చెప్పారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ మొత్తం రెండు లక్షలా రెండు వేల హెక్టార్లకుగాను లక్షా అరవై తొమ్మిది వేల హెక్టార్లలో సాగు అయినట్లు కలెక్టర్కు వివరించారు. సాగుచేస్తున్న రైతులలో 99 శాతం మంది ఈ-పంట నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతుల ఈ- కె.వై.సి. వివరాలను ఈ నెల 10వ తేదీకి పూర్తి చేస్తామని చెప్పారు. రైతు సేవా కేంద్రాలు, ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన ఎరువులను రాయితీపై అందిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ …బహిరంగ మార్కెట్లో ఎరువులు, పురుగు మందులను అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులతోనూ కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడారు. రైతులందరూ తప్పనిసరిగా ఈ- పంట నమోదు చేయించుకోవాలని ఆమె చెప్పారు. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు రైతులకు దక్కుతాయన్నారు. కాగా, తమకు నీటి సమస్య ఉందని, కాలువల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరును రైతులు కోరగా, ಆನ సానుకూలంగా స్పందించారు. అనంతరం నియోజకవర్గస్థాయి వ్యవసాయ పరీక్షా కేంద్రాన్ని కూడా ఆమె సందర్శించారు. ఎరువులు, విత్తనాల నాణ్యతనూ, తేమ శాతాన్ని పరీక్షించే విధానాన్ని గురించి సిబ్బంది ఈ సందర్బంగా కలెక్టర్ కు వివరించారు.
కలెక్టర్ వెంట వ్యవసాయ శాఖ ఏ.డి. రమేష్ బాబు, తహసీల్దార్ ఆదిలక్ష్మి, వ్యవసాయ అధికారి పావని, ఉద్యాన అధికారి ప్రత్యూష, ఇతర అధికారులు ఉన్నారు.




