దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీశైలంలో వెలసిన శ్రీ భ్రమరాంబిక దేవి దశమి రోజు పరిపూర్ణమైన రూపంలో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తుందని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు అన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీశైల దేవస్థానంలోని ధర్మనిధి వేదికపై ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమంలో పొన్నూరు వేంకట శ్రీనివాసులు దేవి శరన్నవరాత్రి వైభవం పై ప్రసంగించారు. నవదుర్గలుగా అమ్మవారిని తొమ్మిది రోజు ఆరాధించడం వలన మానవుల్లో ఉన్న అసుర శక్తులు నశించిపోయి నరుడు నరోత్తముడుగా మారుతాడని అన్నారు. దేవీ నవరాత్రుల్లో శక్తి ఆరాధన వాక్కుని, శక్తిని, ఐశ్వర్యాన్ని, యశస్విని ఇస్తుందని అన్నారు. సాక్షాత్తు ఆ దుర్గాదేవి శ్రీశైలంలో భ్రమరాంబికాదేవిగా అవతరించి మహిషాసురుడిని మర్ధించిన రూపమనిన్నారు. శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం వలన పునర్జన్మ ఉండదని పేర్కొన్నారు అన్నారు. చక్కటి ఉపన్యాసం చేసిన ఉపన్యాసకులు పొన్నూరు వేంకట శ్రీనివాసులును దేవస్థానం తరుపున అమ్మవారి శేషవస్త్రంతో సత్కరించి ప్రశంసా పత్రాన్ని అందజేశారు.

