వెలిగొండ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయి పరిస్థితిని మంగళవారం పరిశీలించారు. ఇందుకోసం సోమవారం రాత్రే ఆయన దోర్నాలలోని ఈ ప్రాజెక్టు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయులు, ఒంగోలు ఎం.పీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా, శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ రావు, బీ.ఎన్.విజయ్ కుమార్, కందుల నారాయణరెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఇతర ప్రజాప్రతినిధులు, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్, దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మీ, యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు, తదితరులు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. అనంతరం 9:30 గంటలకు వీరందరూ కలిసి వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్ పరిశీలించారు. ఇప్పటివరకు పనులు కొనసాగిన తీరు, పెండింగ్ పనులపై అధికారులతో చర్చించారు.
మండుటెండలో ద్విచక్ర వాహనాలపై…
అనంతరం వీరు కడపరాజుపల్లె గ్రామం వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువకు ఇటీవల వర్షాల వలన పడిన గండి, కోతలను పరిశీలించారు. కాలువ కట్టపైన కారులు వెళ్లే అవకాశం లేకపోవడంతో మండుటెండలోనూ వీరు రెండున్నర కిలోమీటర్ల దూరం ద్విచక్ర వాహనాలపై వెళ్లి వాటిని పరిశీలించారు.
గొట్టిపడియ గ్యాప్, ఇంటేక్ వెల్ పరిశీలన…
తదనంతరం గొట్టిపడియ డ్యామ్, ఇంటేక్ వెల్ నిర్మాణ పనులను వీరు పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నీటి స్టోరేజీ వివరాలను అధికారులు ఈ సందర్భంగా మంత్రులకు, ప్రజాప్రతినిధులకు వివరించారు. ఇక్కడ నీటి స్టోరేజ్ వలన భూగర్భ నీటిమట్టం పెరగడంతో పాటు ముంపు, పునరావాస అంశాలను కూడా వారికి తెలియజేశారు. అనంతరం మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెలిగొండ ప్రాజెక్టు పూర్తి నమూనాను మంత్రులు పరిశీలించారు. ఈ ప్రాజెక్టు వలన కలిగే తాగు, సాగునీటి ప్రయోజనాలు, ఇతర వివరాలను ప్రాజెక్ట్స్ ఎస్.ఈ. అబూత్ అలీమ్ ఈ సందర్భంగా మంత్రులకు వివరించారు. మధ్యాహ్నం 3:30 గంటల వరకు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పనులను మంత్రులు పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ తో కలిసి ఇక్కడకు వచ్చి స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు..






