ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రధాన భద్రతాధికారిగా విధులు నిర్వహిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ 16వ వర్ధంతి సందర్భంగా, మంగళవారం ఒంగోలు చర్చ్ సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మరియు పోలీసు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… సాల్మన్ కేరీ వెస్లీ పోలీసు శాఖ గౌరవాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించారని పేర్కొన్నారు. సమాజ రక్షణ కోసము తన సమయం, జీవితాన్ని త్యాగం చేయడంతోపాటు ప్రాణాలను సైతం అర్పించడం ఆయన విధిపట్ల ఉన్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి అమరుడైన ఆయనను పోలీసులు స్ఫూర్తిగా తీసుకుని, తమ తమ విధులకు పునరంకితమవాలని పిలుపునిచ్చారు. సాల్మన్ కేరీ గారి కుటుంబానికి పోలీసు శాఖ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు.
సాల్మన్ కేరీ వెస్లీ తల్లి అద్దంకి కమల వెస్లీ నివాళి …..
అనంతరం, అమరుడైన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ తల్లి అద్దంకి కమల వెస్లీ ( 94 ) మంగళవారం మృతిచెందారు. ఆమె భౌతికఖాయాన్ని ఒంగోలు మిరియాలపాలెంలో ఉన్న స్వగృహంలో ఉంచగా, ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించి, సంతాపం తెలియజేశారు. కుమారుడు వర్ధంతి రోజు తల్లి కన్నుమూశారు.
కార్యక్రమంలో ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ఒంగోలు వన్ టౌన్ సీఐ నాగరాజు, ఒంగోలు టు టౌన్ సీఐ శ్రీనివాసరావు, తాలూకా సీఐ విజయకృష్ణ, ఒంగోలు ట్రాఫిక్ సీఐ పాండు రంగారావు, ఆర్ఐలు రమణ రెడ్డి, సీతారామరెడ్డి, సురేష్, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

