సొంత ఇంటితో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం లభిస్తుంది – జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు -గృహప్రవేశాల కార్యక్రమం నిర్వహణ

సొంత ఇంటితో ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవం లభిస్తుందని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. అందుకే అర్హులందరికీ సొంత ఇల్లు నిర్మించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ( 2024 జూన్ ) రాష్ట్రవ్యాప్తంగా పూర్తిచేసిన మూడు లక్షల ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం బుధవారం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాస్థాయి కార్యక్రమాన్ని ఒంగోలు నగరంలోని కేశవరాజు కుంట ప్రాంతంలో హౌసింగ్ అధికారులు నిర్వహించారు. కలెక్టర్ తో పాటు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్, నగర మేయర్ గంగాడ సుజాత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో 7372 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, వీటి లబ్ధిదారులకు రూ.17.77 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. అదేవిధంగా వివిధ నిర్మాణ దశలు పూర్తి చేసుకున్న 11,443 మంది లబ్ధిదారులకు రూ.18.36 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించినట్లు చెప్పారు. గతంలో రూ.1.80 లక్షలతో
పోల్చితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన – 2.0 పథకం కింద రూ.2.50 లక్షలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పాతవారికి కూడా ఈ పెంపును వర్తింప చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీ.వీ.టీ.జీ ( చెంచు ) లకు ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుని అర్హులందరూ ఇల్లు నిర్మించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేదలకు సొంత ఇల్లు ఉండాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఒంగోలు నియోజకవర్గంలో 400 ఇళ్ల నిర్మాణం పూర్తయింది అన్నారు. లబ్ధిదారులకు రూ.95 లక్షల ఆర్థిక ప్రయోజనం కలిగిందన్నారు. అదేవిధంగా వివిధ దశలలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 721 మందికి రూ.1.86 కోట్ల ఆర్థిక సహాయం చేసినట్లు తెలిపారు. టిడ్కో ఇళ్లను కూడా త్వరలోనే లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పేదలకు ఇళ్ల నిర్మాణంతోపాటు ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను సమర్ధంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ కాలనీలో అంతర్గత రోడ్లను నిర్మించేలా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అదేవిధంగా ముక్తినూతలపాడుకు కూడా రోడ్డు వేయిస్తానని చెప్పారు. నగరంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రతి మూడు నెలలకు ఒకసారి తాను జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
రియాజ్ మాట్లాడుతూ గృహప్రవేశాలు చేస్తున్న పేదల జీవితాలలో ఇది ఒక పండుగ రోజు అని వ్యాఖ్యానించారు. పేదల సంక్షేమానికి కూటమి
ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి ఈ గృహప్రవేశాలే ఒక నిదర్శనమని అన్నారు.
మేయర్ మాట్లాడుతూ పేదల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులందరూ ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
తొలుత ఇల్లు మంజూరు అయిన . సుభాషిణి – కోటేశ్వరరావు
దంపతుల గృహ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. ఇంటి నిర్మాణం పూర్తి అయిన శ్రీనివాసులు – రమాదేవి దంపతులకు ఇంటి తాళపు చెవి అందించి, ప్రభుత్వం తరఫున నూతన వస్త్రాలను కూడా వీరు అందజేశారు. కొత్తగా ఇల్లు మంజూరు అయిన లబ్ధిదారులకు కూడా సంబంధిత పత్రాలను ఈ సభా కార్యక్రమంలో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, హౌసింగ్ పీడీ శ్రీనివాస ప్రసాద్, ఒంగోలు ఆర్డిఓ లక్ష్మీ ప్రసన్న, ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *