హైదరాబాద్ డిసెంబర్ 20
(జె ఎస్ డి ఎం న్యూస్) :
సైబర్ నేరగాళ్ల మాయాజాలాన్ని ఛేదించాలంటే పోలీసుల
నిఘా మాత్రమే సరిపోదని, ప్రతి ఇల్లూ ఒక రక్షణ కోటగా మారాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. ప్రజల్లోని భయం, అత్యాశలను పెట్టుబడిగా మార్చుకుని నేరగాళ్లు చెలరేగిపోతున్నారని, వీటిని అడ్డుకునేందుకు ప్రతి కుటుంబంలో ఒకరు ‘సైబర్ సింబా’గా మారి బాధ్యత తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వెస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం మధురానగర్లో నిర్వహించిన ‘జాగృత్ హైదరాబాద్ – సురక్షిత్ హైదరాబాద్’ అవగాహన సదస్సులో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సాంకేతికత ఎంత పెరుగుతోందో, మోసాలు
అంత కొత్త పుంతలు తొక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లాటరీ తగిలిందనో, గిఫ్ట్ వచ్చిందనో ఆశ చూపి బుట్టలో వేసుకోవడం ఒక ఎత్తైతే.. ఫెడెక్స్ కొరియర్ లో డ్రగ్స్ ఉన్నాయంటూ, మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భయపెట్టి డబ్బులు గుంజేయడం మరో ఎత్తు అని వివరించారు.సైబర్ మోసం జరిగిన వెంటనే స్పందించడాన్ని ‘గోల్డెన్ అవర్’ అంటారని, బాధితులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నంబర్కు కాల్ చేయడం లేదా www.cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయడం ద్వారా పోగొట్టుకున్న సొమ్మును ఫ్రీజ్ చేసి, తిరిగి పొందే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల వేళ ఆఫర్లు, గిఫ్ట్ కూపన్ల పేరుతో వచ్చే మెసేజ్లు, వాట్సాప్ లింకుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నగరాన్ని సైబర్ క్రైమ్ రహితంగా మార్చేందుకు మంగళ, శనివారాల్లో పోలీసులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఈ యజ్ఞంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకే ‘సైబర్ సింబా’ వలంటీర్ల వ్యవస్థను తెచ్చామన్నారు. సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేస్తున్న నేరగాళ్ల పట్ల కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలనిసూచించారు.మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ విచారణ వేగంగా జరుగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఐబొమ్మ రవి విచారణలో కీలక సమాచారం రాబడుతున్నామని అదనపు సీపీ (క్రైమ్) శ్రీనివాసులు, పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిసిపి ఎ. అరవింద్ బాబు, వెస్ట్ జోన్ డిసిపి సిహెచ్. శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు మనోహర్ రావు, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.


