హైదరాబాద్ జనవరి 14
(జే ఎస్ డి ఎం న్యూస్):
పరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా అంతర్జాతీయ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ సంక్రాంతి పండుగ రోజున ముగిసింది.
తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కన్నుల పండువగా జరిగిన అంతర్జాతీయ కైట్ మరియు స్వీట్ ఫెస్టివల్ – 2026 గురువారం ఘనంగా ముగిసింది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలకు నగరవాసులు లక్షలాదిగా తరలివచ్చారు.ఈ ఏడాది కైట్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఫ్రాన్స్,శ్రీలంక,జపాన్,కొరియా,వియత్నాం,అల్జీరియా సహా పలు దేశాల నుంచి 40 మందికి పైగా అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్ పాల్గొన్నారు.
వీరితో పాటు భారత్లోని వివిధ రాష్ట్రాల నుండి వృత్తిపరమైన గాలిపటాల ప్రేమికులు తమ విన్యాసాలతో ఆకట్టుకున్నారు.ఇందులో ఎలియన్ ,వందేమాతరం,తిమింగలం వంటి కైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రి వేళల్లో ఎగురవేసిన ఎల్ ఈ డి గాలిపటాలు ఆకాశంలో రంగుల వెలుగులను విరజిమ్మాయి.
సుమారు 60కి పైగా స్టాల్స్తో ఏర్పాటు చేసిన స్వీట్ ఫెస్టివల్లో వివిధ రాష్ట్రాల సాంప్రదాయక రుచులు సందర్శకులను అలరించాయి. బెంగాల్ ,కేరళ, బీహార్, గోవా లతో పాటు తెలంగాణ పిండివంటలు ఈ వేడుకలకు అదనపు హంగులు అద్దాయి.కల్చరల్ ఈవెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కైట్ ఫ్లయర్స్ అందరినీ టీజీటీడీసీ ఎండి శ్రీమతి క్రాంతి వల్లూరు అభినందించి, జ్ఞాపికలతో సత్కరించారు.
వీటితో పాటుగా వీకెండ్ వండర్స్ కంటెస్ట్ విన్నర్స్ ను సైతం వేదికపైకి పిలిచి ప్రైజ్ మనీ ని అందించారు.ముగింపు రోజైన గురువారం సెలవు దినం కావడంతో పరేడ్ గ్రౌండ్స్ జనసందోహంతో నిండిపోయింది. రంగురంగుల పతంగులతో సికింద్రాబాద్ ఆకాశం ఇంద్రధనస్సును తలపించింది. ఈ ఈవెంట్ అనంతరం జనవరి 16 నుండి 18 వరకు నిర్వహించబోయే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ మరియు 16న పరేడ్ గ్రౌండ్ లో సింగర్ మంగ్లీ లైవ్ కాన్సర్ట్ పట్ల పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.




