అచ్చతెలుగు భాషా సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ రచించిన “తెలుగు బిడ్డ శతకం” సరళంగా, సుందరంగా సాగిందని అద్దంకి రెవిన్యూ డివిజన్ అధికారి యస్. జాన్సన్ తెలిపారు. గురువారం దర్శి తహశీల్దారు కార్యాలయంలో గ్రంథాన్ని ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు .
దర్శి తహశీల్దారు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ ఈ శతకాన్ని రచించి దర్శి తహశీల్దారు శ్రవణ్ కుమార్ కి అంకితం ఇవ్వడం విశేషం. తెలుగు భాషపై ఆయనకున్న అభిమానం, పదసంపద ఈ రచనలో ప్రతిబింబించిందని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభినందించారు.
ఈ కార్యక్రమానికి కప్పగంతుల మధుసూదన శాస్త్రి అధ్యక్షత వహించారు. అక్షర తపస్వి అన్నపురెడ్డి వీరారెడ్డి, పుట్టంరాజు శ్రీరామ చంద్ర మూర్తి, అట్లూరి రామారావు, వి. వెంకటేశ్వరరావు, ప్రేమ్ కుమార్, జి.వి. రత్నం, యస్.వి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని రచయితను అభినందించారు.


