దళిత బహుజన రిసోర్స్ సెంటర్ (డిబిఆర్సి) ఆధ్వర్యంలో తాళ్లూరు మండలం దారం వారి పాలెం గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు బాలల హక్కుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిబిఆర్సి రీజనల్ కో-ఆర్డినేటర్ దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ … బాల్యవివాహాలు, బాల్య కార్మిక వ్యవస్థ బాలల జీవితాలను నాశనం చేస్తాయని తెలిపారు. బాల్యం ఆటపాటలతో చదువులతో ఆనందంగా సాగాలని అన్నారు. భారత రాజ్యాంగం బాలలకు 54 హక్కులను కల్పించడం జరిగిందని అన్నారు, ఈ హక్కుల ద్వారా జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, భాగస్వామ్య హక్కు, ఎదిగే హక్కులను రాజ్యాంగం కల్పించిందని అన్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా సమాజంలో ప్రజలలో అవగాహన రాహిత్యం వలన నేటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం నాడు నేడు మధ్యాహ్న భోజనం వంటి పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాలలో బాలబాలికలకు చదువులను చెరువ చేసిందని అన్నారు.
గ్రామ సచివాలయల మహిళ సంరక్షణ కార్యదర్శి డి. సుశీల మాట్లాడుతూ ఆడపిల్లల హక్కులకు ఉల్లంఘన జరిగితే 100 లేదా 1098 లకు కానీ దిశా యాప్ ద్వారా ఎస్ఓఎస్ కాల్ చేసి రక్షణ పొందాలని అన్నారు. ప్రతి విద్యార్థిని గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాల్య వివాహాల వలన శారీరకంగా ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలను తెలియజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి బాలిక మలాల, సావిత్రిబాయి పూలే, కల్పనా చావ్లా వంటి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం, అంగన్వాడి టీచర్, గ్రామైక్యసంఘఅధ్యక్షులు గోపనబోయిన అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.

