వైసిపి పాలనలో అవినీతి రాజ్యమేలుతోందని… అక్రమాలను ప్రశ్నిస్తే అడ్డగోలుగా కేసులు బనాయిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ అవినీతిపై రాష్ట్రవ్యాప్తంగా రాజీలేని పోరు సాగిస్తామని స్పష్టం చేశారు. సోమవారం… పార్టీ రాష్ట్రఅధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అధ్యక్షతన ఒంగోలు విష్ణు ప్రియ కన్వెన్షన్ హాలులో భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆ వివరాలను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పి.వి.ఎన్.మాధవ్, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి అసమర్థ పాలనతో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని విమర్శించారు. కేవలం కేంద్ర నిధులతోనే అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయ న్నారు. పంచాయతీలతో పాటు… ఎస్సీ, బీసీ ఉప ప్రణాళిక నిధులను సైతం దారిమళ్లించి ఆయా వర్గాలకు తీరని ద్రోహం. చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో యథేచ్ఛగా సహజ వనరుల దోపిడీ సాగుతోందన్నారు. సీపీఎస్ రద్దు, ఏడాదికో జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎడాపెడా పెంచిన విద్యుత్తు ఛార్జీల విషయమై… పార్టీ పోరు సాగిస్తుందన్నారు. ఎస్సీ కులాల వర్గీకరణకు పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తూ, దిక్కుతోచని స్థితిలోరైతులు ఉన్నా… ఆదుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పొత్తులపై పార్టీ కేంద్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో జనసేనతో కలిసే ఉన్నామని… అధికార పార్టీ అక్రమాలపై ఇరు పార్టీలు కలిసే పోరాటాలు చేస్తాయని పేర్కొన్నారు. పీడీసీసీ బ్యాంకు మాజీ అధ్యక్షుడు ఈదర మోహన్ భారతీయ జనతా పార్టీ లో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జాతీయ సంఘటన్ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, శివప్రకాష్, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్ నర సింహరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు, ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్రాజు, విష్ణువర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ, జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ యోగయ్య యాదవ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు పీవీ శివారెడ్డి , జిల్లా పార్టీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.







