సనత్ నగర నియోజకవర్గంలో అభివృద్ధి జరిందనేది కేవలం బూటకమేనని మాజీ మంత్రి, బిజెపి అసెంబ్లీ అభ్యర్థి మర్రిశశిధర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మొహన్ యాదవ్ తో కలిసి ఆయన రాంగోపాల్ పర్ డివిజన్ లోని నల్లగుట్ట, గైదిన్ బాగా, సి లైన్, ఎఫ్ లైన్, జె లైన్ ,చుట్టలబస్తీ, తదితర ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి మాటున అంతకంటే ఎక్కువ అవినీతి జరిగిందని ఆయన అన్నారు. అంత అభివృద్ధి జరిగి ఉంటే తమ పాదయాత్రలో ఎందుకు ప్రజలు ఇన్ని సమస్యలు తమదృష్టికి తెస్తారని ప్రశ్నించారు. నల్లగుట్ట మార్కెట్ ను కొత్తగా నిర్మిస్తామని ఐదేళ్ల క్రితం శిలఫలకం వేసారని కానీ ఇప్పటికి ఆ శిలాఫలకం వెక్కిరిస్తుందన్నారు. కలాసీగుడా నాలా ఆధునీకరణ గాలికి వదలివేశారని, నాలలో పూడికతీత పైపైన చేపట్టి కమీషన్లు దండుకోవడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. నల్లగుట్ట, గైదీన్ బాగ్, ప్యారడైస్ ప్రాంతాల్లో రోడ్లు ఎంత ఘోరంగా ఉన్నాయో ప్రజలు చూస్తున్నారని అన్నారు. వ్యాపార ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజి వేయాలంటే మాకేమిస్తారని అడిగి పనులు ఆపేసిన సంగతి అందరికీ తెలుసున్నారు. డివికాలనీ లాంటి కాలనీల్లో బిజెపికి ఓట్లు వేస్తారని అభివృద్ధి పనులు అపి వేశారని ఇప్పుడు పాదయాత్రలో ఆ విషయాలు ప్రజలే బయట పెడుతున్నారని విమర్శించారు. పీజీ రోడ్డులో మంత్రి హడావిడి నిర్ణయాలతో వైట్ టాపింగ్ రోడ్డు వేస్తే రెండు నెలలు తిరగక ముందే తవ్వాల్సి వచ్చిందన్నారు. దీంతో 25 ఏళ్ళు మన్నిక ఉండాల్సిన రోడ్డు ఎన్నాళ్ళుంటుందో తెలియడం లేదన్నారు. మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ.. దశాబ్దాల రాజకీయ అనుభవమున్న మర్రి శశిధర్ రెడ్డి లాంటి మచ్చలేని నాయకుడు తమకు అవసరమని ప్రజలు కోరుతున్నారని అన్నారు. అలాగే మంత్రి కుటుంబ సభ్యల బలవంతపు వసూళ్లు, అక్రమాలను ప్రోత్సహిస్తూ చేస్తున్న వాటి నుంచి తమకు విముక్తి కావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చీర సుచిత్ర, నాయకులు చీర శ్రీకాంత్, ఆకుల ప్రతాప్, దయానంద్, అప్జల్, నమన్, ఆనంద్, వి నరేష్ తదితరులు పాల్గొన్నారు..



