మొక్కజొన్న కోత
దశలో రైతులు తగిన మెళకువలు పాటించాలని తాళ్లూరు మండల వ్యవసాయ అధికారి బి ప్రసాద్ రావు అన్నారు. క్షేత్ర పర్యటనలో భాగంగా సోమవారం ఆయన శివరాంపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా మొక్కజొన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు తగిన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ …మొక్కజొన్న పంట కోత దశకు చేరిన సమయంలో బుట్టపై పొరలు ఏర్పడి కనిపిస్తాయని, పంట బాగా ఎండి కండే మొక్క క్రింది వైపుకు వేలాడుతూ ఉంటుందని, గింజను వేళ్ళతో నొక్కినట్లయితే గట్టిగా ఉంటుందని ఇది మొక్కజొన్నకండే కోత దశకు వచ్చినట్లుగా గుర్తించాలని ఆయన తెలిపారు. మొక్కజొన్న మొక్క నుండి కండెలు వేరు చేసిన సమయంలో 25నుండి 30 శాతం తేమశాతం కలిగి ఉంటుందని, తదుపరి కండేలను నాలుగు రోజులు ఎండ బెట్టాలని ఆయన తెలిపారు. తదుపరి ప్రత్యేక యంత్రాల ద్వారా కండే నుండి గింజలు వేరు చేసి మూడు రోజులు ఆరపెట్టాలని తదుపరి గింజలను శుద్ధి చేసిన గోనెసంచులో నిలువ చేయాలని ఆయన తెలిపారు. ఎలుకలు, పురుగులు, బూజు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
