జనజీవనిధానంలో నాణ్యమైన ఆహారం ప్రతి ఒక్కరికి అవసరమని తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని సాధించటమే కాకుండా భవిష్యత్ తరాలకు జీవమున్న సారవంతమైన భూమిని అందించాల్సిన ఆవశ్యకతను వక్తలు వివరించారు. ఆత్మ కార్యాలయంలో ఆవరణలో మంగళవారం స్కిల్ ట్రైనింగ్ రూరల్ యూత్ (ఎన్టీఆర్వై) ప్రారంభించారు. ఆత్మ పీడీ అన్నపూర్ణ అధ్యక్షతన సభను నిర్వహించారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువత వ్యవసాయ రంగంపై ఆసక్తిలో మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్(పీడీ) కె అన్నపూర్ణ మాట్లాడుతూ యువ రైతులకు వారం రోజుల పాటు ఇస్తున్న శిక్షణ చక్కగా ఉపయోగపడుతుందని, అన్ని విభాగాలకు చెందిన నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆర్గానిక్ ఫార్మింగ్ వలన దీర్ఘకాలంలో మంచి ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. జిల్లా ఉద్యానవన శాఖాధికారి వై గోపి చంద్ మాట్లాడుతూ ఉద్యానవన పంటలలో సేంద్రీయ వ్యవసాయం ద్వారా యువత సాధిస్తున్న విజయాలను స్పూర్తిగా తీసుకోవాలని చెప్పారు. శిక్షణ ప్రతి ఒక్కరికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పారు. డీపీఎం వి. సుబాషిణి ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను వివరించారు. దర్శి ఎఆర్ఎస్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ బి ప్రమీణరాణి మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంలో సాగు చేసిన పంటలకు మంచి గిరాకీ ఉందని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నూతన పంటలను సాగు చేసుకుంటే వ్యవసాయం లాభదాయమని చెప్పారు. సాయిల్ టెస్ట్ ఎడీఏ ఎస్ సుచరిత మాట్లాడుతూ భూమిలో ఉన్న ఖనిజాలు, లవణాలను ముందుగా పరీక్షించి అవసరమైన ఖనిజాలను, లవణాలను అందించి వ్యవసాయాన్ని లాభదాయంగా చేసుకోవచ్చని అన్నారు. శిక్షణలో పాల్గొన్న 28 మంది యువ రైతులకు ముందుగా సేంద్రీయ వ్యవసాయంపై ఉన్న అవగాహను మూల్యాంకన పరీక్ష నిర్వహించారు. శిక్షణ అనంతరం యువ రైతులకు సర్టిఫికేట్స్ అందజేయనున్నట్లు ఆత్మ పీడీ అన్నపూర్ణ తెలిపారు. కార్యక్రమంలో డిడిఎహెచ్ రాణి, శేషము, సిబ్బంది పాల్గొన్నారు.



