అంగ బలం, ఆర్థిక బలం తోనే ప్రజా పోరు ఎన్నికలలో విజయం సాధించలేమని ప్రజల అవసరాలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా కార్యాచరణ రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లిన నాడు తప్పనిసరిగా విజయం సాధిస్తారని… ప్రస్తుతం బిజెపి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పీవీ శివారెడ్డి ప్రజలకు కల్పిస్తున్న భరోసా అదే… అంతటి సమర్థత నాయకత్వ లక్షణాలు శివారెడ్డిలో గమనించారు కాబట్టి మొన్న రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అధ్యక్షతన రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశాలు ఒంగోలులో నిర్వహించడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పివి శివారెడ్డి తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో తమ మనసులోని భావాలను వ్యక్తపరచారు…
భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రానున్న సార్వత్రిక లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్ర అధిష్టానం ఆదేశం మేరకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పి వి శివారెడ్డి మీడియా ప్రతినిధికి తెలిపారు.
గురువారం తమ కార్యాలయం స్థానిక విష్ణు ప్రియ కన్వెన్షన్ హాల్లో మీడియా ప్రతినిధి తో మాట్లాడుతూ 2024వ సంవత్సరం ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలకు బలమైన పోటీనిస్తుందని, గతంలో కంటే మరింత మెరుగైన స్థితిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలతో మమేకమై వారి సాధక బాధలను తెలుసుకోవడమే కాకుండా… రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా అభివృద్ధి నిరోధక పాలనను తెలుపుచూ మరియు కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలను చిట్ట చివరి లబ్ధిదారు వరకు చేరే విధంగా మా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తనవిగా చెప్పుకుంటూ అసత్య ప్రచారం చేసుకోవడాన్ని ఎప్పటికప్పుడు మా కార్యకర్తలు ఖండిస్తూ ప్రజలకు ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకమని తెలిపే విధంగా సమావేశముల ద్వారా, మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువ చేస్తున్నారని వివరించారు.
మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2024 ఎన్నికలు తమకు ఎంతో ప్రతిష్టాత్మకమని, ఈ పది సంవత్సరాలలో ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ ఆర్ధిక అభివృద్ధికి, ప్రజల రక్షణకు, ఆరోగ్య భారతావని సాధించడానికి మరియు ప్రపంచంలో భారత్ దేశానికి గత పాలకుల పాలన సమయంలో లేనట్టి ఉన్నత స్థితిని దేశానికి అందించారని వీటన్నింటినీ ప్రజల వద్దకు తీసుకువెళ్లే బాధ్యత మా అందరి పై ఉన్నదని తెలిపారు.
జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుతూ పాలక ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు విమర్శించుకోవడం తప్పితే ప్రజలకు అవసరమైన విషయాలపై పోరు సాగించట్లేదని, గత ప్రభుత్వం చేసిన పనులను విమర్శించడం తప్పితే ఒంగోలు అసెంబ్లీ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనల్లో పాలకపక్షం ఏమాత్రం దృష్టి పెట్టలేదని ఇటు చూస్తే ప్రతిపక్షం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉందని తెలిపారు.
జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన ఈ రెండు సంవత్సరాల కాలంలో జరిగిన పార్టీ కార్యక్రమాలపై స్పందిస్తూ జిల్లా నాయకత్వ బాధ్యతలు తీసుకున్న సమయంలో పార్టీ సిద్ధాంతాలను తెలిపి 5000 కుటుంబాలను పార్టీ సభ్యులుగా చేర్చడం జరిగిందని, ఏ కార్యకర్తకు ఏ అవసరం వచ్చినా… ఏ సమయంలోనైనా స్పందిస్తూ వారికి అండదండగా నిలవడం జరుగుతున్నదని తెలిపారు. ఎప్పటికప్పుడు మండలాల వారీగా శక్తి కేంద్రాలను బలోపేతం చేసుకుంటూ పార్టీ నాయకులను కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ముందుకు సాగుతున్నామని కార్యకర్తలకు ఎల్లప్పుడూ భరోసాగా పార్టీ ఉంటుందని తెలిపే విధంగా వెన్నుదన్నుగా ఉంటున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు నాయకులు కోరిన మీదట రాష్ట్ర అధిష్టానం తనపై బలమైన నమ్మకంతో ఆదేశిస్తే తప్పనిసరిగా ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా లోక్ సభ కు పోటీ చేస్తానని, విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఈ రెండు సంవత్సరాల కాలంలోనే పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం చూడగలుగుతున్నామని గత రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అధ్యక్షతన మరియు ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి నాయకత్వంలో వారి సూచనలతో మరింతగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం జరిగిందని తెలిపారు.
ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శివారెడ్డి అంటూ మీడియా ప్రతినిధి నిష్క్రమించారు.
